న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ట్రంప్ విధించిన టారిఫ్లు చెల్లవు అంటూ అమెరికా సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించిన క్రమంలో ఆ కేసును వాదించింది ఎవరా? అని అందరూ దృష్టి సారించారు. ఆయన మరెవరో కాదు.. భారత సంతతికి చెందిన న్యాయవాది నీల్ కత్యాల్. నీల్ కత్యాల్ షికాగోలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుంచి వలస వచ్చారు.
ఒకప్పుడు దేశ అత్యన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా, యూఎస్ మాజీ యాక్టింగ్ సోలిసిటరల్ జనరల్గా పనిచేసిన ఆయన ట్రంప్ అక్రమంగా విధించిన టారిఫ్లకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని నిగ్గదీశారు. అన్యాయంగా ఆ పన్నులు విధించే అధికారం ట్రంప్నకు లేదని గట్టిగా వాదించారు. వాటి ప్రభావం కేవలం విదేశాలపైనే కాదు అమెరికాలోని చిన్న వ్యాపారులు, దేశ ప్రజలపై పడుతుందన్న విషయాన్ని నొక్కి చెప్పారు.
చిన్న వ్యాపారులు డెమోక్రాటిక్ పాలిత రాష్ర్టాల కూటమి తరపున ట్రంప్ టారిఫ్లకు వ్యతిరేకంగా నీల్ కత్యాల్ ఈ కేసులో.. ట్రంప్ 1977 అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ)ను అమలు చేయడానికి వ్యతిరేకంగా వాదించారు. తీర్పు అనంతరం ఆయన మాట్లాడుతూ ‘నేడు సుప్రీం కోర్టు చట్టబద్ధ పాలన, అమెరికన్ల కోసం నిలబడింది. అధ్యక్షులు శక్తిమంతులే. కానీ మన రాజ్యాంగం ఇప్పటికీ అతిశక్తివంతమైనది. ఒక్క కాంగ్రెస్ మాత్రమే అమెరికా ప్రజలపై పన్నులు విధించగలదు. దానికి మాత్రమే ఆ అధికారం ఉంది’ అని పేర్కొన్నారు. సుప్రీం ఇచ్చిన ఈ తీర్పును రాజ్యాంగ మైలురాయిగా ఆయన అభివర్ణించారు.