లాహోర్, మే 28: భారత్-పాకిస్థాన్ మధ్య కుదిరిన ‘1999 లాహోర్ ఒప్పందాన్ని’ పాక్ ఉల్లంఘించిందని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంగీకరించారు. నాటి భారత ప్రధాని వాజ్పేయి, తాను ఆ ఒప్పందంపై సంతకాలు చేశామని, అయితే ఆ ఒప్పందాన్ని అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉద్దేశపూర్వకంగా అతిక్రమించారని ఆరోపించారు. మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘1998, మే 28న పాకిస్థాన్ ఐదు అణు పరీక్షలు నిర్వహించింది. దాంతో వాజ్పేయి మా దేశానికి వచ్చి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ ఒప్పందాన్ని మేమే అతిక్రమించాం. అది మా తప్పే’ అని ఆయన ఒప్పుకున్నారు.