వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంగారకుడిపైకి పంపిన పర్సీవరెన్స్ రోవర్ అక్కడి రాళ్ల నమూనాలను సేకరించడంలో విఫలమైంది. అంగారక గ్రహంపై జెజెరో క్రేటర్ వద్ద రాళ్లు, మట్టి నమూనాలను సేకరించడానికి పర్సీవరెన్స్ చేసిన తొలి ప్రయత్నం విఫలమైందని నాసా ప్రకటించింది. పర్సీవరెన్స్ రాళ్ల నమూనాలను సేకరించడానికి అక్కడి నేలను ఏడు అడుగుల లోతు, 2 అడుగుల వెడల్పుతో తవ్వేలా ప్రోగ్రామ్ చేశారు. ఇలా తవ్విన తర్వాత రోవర్లోని రోబోటిక్ చేయి నమూనాలను సేకరించి సంచీల్లో నింపుతుంది. రోవర్ తొలి ప్రయత్నంలో తవ్వకం వరకు ప్రక్రియ సాఫీగా జరిగిందని, నమూనాను సేకరించలేకపోయిందని నాసా తెలిపింది.