యాంగోన్: మయన్మార్లో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిరసనకారులను ఆ దేశ సైన్యం అణగదొక్కుతున్నది. తాజాగా ఆదివారం యాంగోన్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఒక గుంపుమీదకు మిలటరీ వాహనం వెనుక నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా పలువురు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మిలటరీ వాహనం దూసుకొస్తుండటాన్ని గమనించిన పలువులు కేకలు వేయడంతోపాటు ఢీకొట్టిన అనంతరం బాధితుల ఆర్తనాదాలు, పరుగులు ఇందులో కనిపించాయి.
నిరసనకారులు రోడ్డుపైకి వచ్చిన రెండు నిమిషాల్లో సైనిక వాహనం వారిపైకి దూసుకొచ్చిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాకు తెలిపారు. అనంతరం అందులోంచి దిగిన సైనికులు నిరసనకారులను తరిమికొట్టారని చెప్పారు. కాల్పులు జరుపడంతోపాటు వాహనం ఢీకొనడంతో గాయపడిన, తప్పించుకోలేని పది మంది యువతను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 1న జరిగిన సైనిక తిరుగుబాటుతో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఆ దేశ సైన్యం నాటి నుంచి సైనిక పరిపాలన కొనసాగిస్తున్నది. ఇటీవల సూకీపై డజనకుపైగా క్రిమినల్ కేసులు నమోదు చేసింది. దీంతో ప్రజలు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు.