నకిలీ ఖాతాలు 5 శాతంలోపే ఉన్నాయని రుజువు చేయాలి
అప్పుడే డీల్పై ముందుకు
న్యూఢిల్లీ, మే 17: మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ను కొనుగోలు చేసేందుకు కుదుర్చుకున్న డీల్పై ప్రపంచ శ్రీమంతుడు ఎలాన్ మస్క్ మరో మెలికపెట్టారు. ట్విట్టర్లో నకిలీ/స్పామ్ ఖాతాలు 5 శాతంలోపే ఉన్నాయన్న రుజువును కంపెనీ చూపించేంతవరకూ లావాదేవీ ముందుకు కదలదని మస్క్ ప్రకటించారు. మంగళవారం ఒక యూజర్కు బదులిస్తూ మస్క్ ఈ విషయం తెలిపారు. తమ ప్లాట్ఫామ్లో స్పామ్ ఖాతాల సంఖ్య 5 శాతంలోపే ఉంటుందని ఇటీవల ట్విట్టర్ అమెరికా నియంత్రాణా సంస్థ సెక్యూరిటీ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)కు ఒక ఫైలింగ్లో తెలిపింది. ఈ సంఖ్య ఎంత ఉంటుందో తేలేంతవరకూ ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను తాత్కాలికంగా నిలుపుచేస్తున్నట్టు మూడు రోజుల క్రితం ప్రకటించిన మస్క్ తాజాగా 5 శాతంలోపు ఉందన్న రుజువుచూపితేనే కొంటానన్నారు. స్పామ్ బొట్స్ ట్వీట్లపై (రొబొటిక్ సాఫ్ట్వేర్ సృష్టించే ట్వీట్లు)పై తమ కంపెనీ పోరు జరుపుతున్నదని, ఈ క్రమం లో అవి 5 శాతంలోపే ఉంటాయన్న తాము అంచనాలకు వచ్చినట్టు ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ చేసిన పలు ట్వీట్లు చేశారు. రుజువులు చూపలేమని సూచనప్రాయంగా తెలిపారు. వాటిని మస్క్ పదేపదే పరిశీలించిన తర్వాత 20 శాతం వరకూ నకిలీ/స్పామ్ ఖాతాలు ఉంటాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఎస్ఈసీకి ట్విట్టర్ సమర్పించిన ఫైలింగ్ సరైనదిగా పరిగణించి తాను 44 బిలియన్ డాలర్ల కొనుగోలు ఆఫర్ ఇచ్చానని మంగళవారం మస్క్ వివరించారు. ‘5 శాతంలోపు ఉన్నట్టు రుజువు చేయడానికి ట్విట్టర్ సీఈవో నిరాకరించారు. ఆయన చూపించేదాకా డీల్ ముం దుకు కదలదు’ అన్నారు.
డీల్పై బేరసారాలు
44 బిలియన్ డాలర్ల లావాదేవీ ధరను తగ్గించేందుకు లేదా లావాదేవీ నుంచి బయటపడేందుకు మస్క్ చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ నకిలీ ఖాతాల సమస్య లేవనెత్తినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మియామిలో జరిగిన ఒక టెక్నాలజీ సదస్సులో మస్క్ మాట్లాడుతూ ట్విట్టర్ 22.9 కోట్ల ఖాతాల్లో కనీసం 20% స్పామ్ బొట్స్ ఉంటాయని తన విశ్లేషణలో తేలిందన్నారు. అలాగే గత నెలలో తాను ప్రతిపాదించిన 44 బిలియన్ డాలర్ల ఆఫర్కంటే తక్కువ చెల్లిస్తానంటూ కూడా ఆ సదస్సులో సంకేతాన్నిచ్చారు. ఈ డీల్ పూర్తయ్యే అవకాశాలు 60 శాతమే ఉన్నాయని వెడ్బుష్ సెక్యూరిటీస్ అనలిస్ట్ డాన్ ఐవ్స్ అన్నారు. తక్కువ ధరకు ట్విట్టర్ దిగిరాకపోతే, మస్క్ 1 బిలియన్ డాలర్ల పెనాల్టీని చెల్లించి లావాదేవీ నుంచి బయటపడచ్చని అంచనా వేస్తున్నట్లు డాన్ ఐవ్స్ తెలిపారు. నిర్ణీత సమయంలోగా మస్క్ లావాదేవీని పూర్తిచేయలేకపోతే ట్విట్టర్కు పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది. కొద్ది వారాలుగా మార్కెట్ పరిస్థితులు వేగంగా మారిపోయినందున.. ఈ లావాదేవీ నుంచి బయటపడేందుకే మస్క్.. ట్విట్టర్ స్పామ్ ఖాతాల సాకు చూపిస్తున్నారని పలువురు ఇన్వెస్టర్లు భావిస్తున్నట్లు ఐవ్స్ వివరించారు. ఒక్కో ట్విట్టర్ షేరుకు 54.2 డాలర్లు చెల్లించేందుకు మస్క్ డీల్ కుదుర్చుకోగా, ప్రస్తుతం ఆ షేరు 37 డాలర్లస్థాయికి పతనమయ్యింది.