కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. లివివ్ నగరంపై ఇవాళ మిస్సైల్ దాడి జరిగింది. నాలుగు క్షిపణులతో ఇవాళ రష్యా అటాక్ చేసినట్లు గవర్నర్ మాక్సిమ్ కోజిస్కీ తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నాలుగు మిస్సైళ్లతో దాడి జరిగినట్లు తెలుస్తోందని ఆయన తన టెలిగ్రామ్ ఛానల్లో తెలిపారు. బయటకు ఎవరూ రావద్దు అని, అందరూ షెల్టర్లలోనే ఉండాలని సూచించారు. పశ్చిమ లివివ్ ప్రాంతంలో అనేక పేలుడు శబ్ధాలు వినిపించినట్లు చెప్పారు. పోలాండ్ బోర్డర్ సమీపంలో లివివ్ పట్టణం ఉంది. పశ్చిమ లివివ్లో ఇవాళ కనీసం అయిదు పేలుడు శబ్ధాలు వినిపించాయి. అటాక్ ప్రాంతాల నుంచి నల్లటి దట్టమైన పొగు కమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. లివివ్ పట్టణంలో గత వారం రష్యాకు చెందిన అనేక క్రూయిజ్ మిస్సైళ్లు నేలకూలినట్లు తెలుస్తోంది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్కు జెలెన్స్కీ ఆహ్వానం పంపారు. రష్యా దాడి వల్ల తీవ్ర నష్టం జరిగింది, ఆ ప్రాంతాలను విజిట్ చేసే క్రమంలో తమ దేశానికి రావాలని మాక్రన్కు జెలెన్స్కీ వెల్కమ్ పలికారు. రష్యా నరమేధానికి పాల్పడుతోందని జెలెన్స్కీ ఆరోపించారు. మారియపోల్ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నగరంలో చిక్కుకున్న వారి కోసం మూవ్మెంట్ పాసులను రష్యా జారీ చేసింది. ఈ పాసులు ఉంటేనే ఇతర ప్రాంతాలకు వెళ్లే వీలు ఉంటుంది. లుహాన్స్కీ ప్రాంతం ప్రజలు కూడా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ఉక్రెయిన్ అధికారులు కోరారు. ఖార్కివ్లో జరిగిన దాడిలో అయిదుగురు చనిపోయారు.