అంకారా: తుర్కియాను కుదిపేసిన భారీ భూకంపం (Turkey earthquake) నుంచి సురక్షితంగా బయటపడిన ‘మిరాకిల్ బాబు’ రెండు నెలల తర్వాత తల్లి ఒడికి చేరాడు. ఆ బాబు తల్లి చనిపోయినట్లు తొలుత అంతా భావించారు. అయితే మరో ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె చివరకు తన బిడ్డను కలుసుకున్నది. ఫిబ్రవరి 6న తెల్లవారుజామున తుర్కియా, సిరియా సరిహద్దులో తీవ్ర స్థాయిలో భూకంపం సంభవించింది. వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. సుమారు 50 వేల మంది ప్రజలు మరణించారు. లక్షల సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు.
కాగా, ఒక భవనం శిథిలాల కింద ఐదున్నర రోజుల పాటు చిక్కుకున్న ఒక పసి బాబు ఆశ్చర్యకరంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఫిబ్రవరి 13న ఆ చిన్నారిని రెస్క్యూ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ బాబు తల్లి చనిపోయి ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే ఆ ‘మిరాకిల్ బాబు’ తల్లి బతికే ఉందని ఉక్రేనియన్ మంత్రి అంటోన్ గెరాష్చెంకో తెలిపారు. శిథిలాల నుంచి గాయాలతో బయటపడిన ఆమె మరో ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు చెప్పారు. చివరకు డీఎన్ఏ పరీక్షల అనంతరం 54 రోజుల తర్వాత తన బిడ్డను ఆమె కలుసుకున్నదని ఆయన వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేశారు.
మరోవైపు తాజా ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సుమారు 51 లక్షల మంది దీనిని చూశారు. అద్భుతమైన వార్త అని నెటిజన్లు పేర్కొన్నారు. బిడ్డతోపాటు తల్లి కూడా ప్రాణాలతో బయటపడి రెండు నెలల తర్వాత కలుసుకోవడం మరింత ఆశ్చర్యకరమని అన్నారు. మిరాకిల్ పసి బాబు కథ చివరకు సుఖాంతం అయ్యిందని, ఇది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. ఆ తల్లీబిడ్డల భవిష్యత్తు సంతోషాలతో కొనసాగాలని పలువురు ఆకాంక్షించారు.
You probably remember this picture of the baby who spent 128 hours under rubble after an earthquake in Turkey. It was reported that the baby's mom died.
Turns out, the mom is alive! She was treated in a different hospital. After 54 days apart and a DNA test, they are together… pic.twitter.com/T7B0paUFxL
— Anton Gerashchenko (@Gerashchenko_en) April 2, 2023