ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా భయంతో వణుకుతోంది. ఈ మహమ్మారి పంజా నుంచి బయటపడ్డామని అనుకున్న ప్రతిసారీ కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి భయాందోళనలు పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక తల్లి తన 13 ఏళ్ల కుమారుడిని తీసుకెళ్లి కరోనా పరీక్షలు చేయించింది.
ఈ పరీక్షల్లో ఆ బాలుడికి కరోనా పాజిటివ్గా ఉన్నట్లు తేలింది. దీంతో కుమారుడి నుంచి తనకు కరోనా సోకుతుందని భయపడిన సదరు మహిళ.. బాలుడిని కారు డిక్కీలో పడేసింది. ఆ తర్వాత ఎక్కడికో బయలుదేరింది. ఇలా కారు డిక్కీలో ఒక బాలుడు ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆ కారును అడ్డగించారు.
డిక్కీలో బాలుడిని చూసి, ఇదేంటని ఆమెను ప్రశ్నించారు. స్థానికంగా స్కూల్ టీచర్గా పనిచేస్తున్న ఆమె.. చాలా స్పష్టంగా తను అలా చేయడానికి గల కారణాన్ని వివరించింది. తన కుమారుడికి కరోనా సోకిందని, అతన్నుంచి తనకు వైరస్ సోకకూడదనే ఉద్దేశ్యంతోనే బాలుడిని డిక్కీలో పెట్టానని చెప్పింది.
మరోసారి కరోనా టెస్టు చేయించేందుకు కుమారుడిని తీసుకెళ్తున్నట్లు వెల్లడించింది. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్లో జరిగింది. ఆ టీచర్ పేరు సారా బీమ్ అని పోలీసులు తెలియజేశారు. బాలుడి ప్రాణాలకు అపాయం కలిగేలా ప్రవర్తించినందుకు సారాపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.