Donald Trump : ఇరాన్ (Iran) తో జరుగుతున్న యుద్ధంలో ఇటీవల అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ విమానం ‘F-15E స్ట్రైక్ ఈగల్’ కూలిపోయింది. ఈ ఘటనలో గల్లంతైన రెండో పైలట్ను తాజాగా అమెరికా దళాలు గుర్తించి రక్షించాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ను తమ సైన్యం విజయవంతంగా పూర్తి చేసిందని అన్నారు. ప్రస్తుతం ఆ పైలట్ అమెరికా బలగాల ఆధీనంలోనే సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.
ఇరాన్లోని ప్రమాదకరమైన పర్వతాల్లో అతడిని గుర్తించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఓ వైపు శత్రువులు అతడి కోసం వేట సాగిస్తుంటే మరోవైపు అతడి కమాండర్ ఇన్ చీఫ్, యుద్ధ కార్యదర్శి, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, ఇతర అమెరికా యోధులు అతడి లొకేషన్ను 24 గంటలూ గమనిస్తూనే ఉన్నారని వెల్లడించారు. పైలట్ను తీసుకురావడానికి తాను డజన్ల కొద్దీ విమానాలను పంపానని, తమ రక్షణ చర్యలకు ఆటంకం కలగకూడదనే ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదని పేర్కొన్నారు.
శత్రు భూభాగంలోకి వెళ్లి ఎయిర్మెన్ రక్షించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారని ట్రంప్ పేర్కొన్నారు. ఏ అమెరికన్ యోధుడిని ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టమని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇరాన్ గగనతలంపై తాము తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించామనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు.