చైనా అగ్రరాజ్యంగా మారాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ప్రపంచంలోని అన్ని దేశాలను శాసించాలని, అందిరిపై పట్టుసాధించాలని తహతహలాడుతున్నది. ఇందులో భాగంగానే తన సైన్యాన్ని పెంచుకుంటూ పోతున్నది. ఆయుధాలనూ సమకూర్చుకుంటున్నది. తాజాగా, శత్రువు మైండ్ను కంట్రోల్ చేసే ఆయుధాలను తయారుచేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుంచే లీక్ అయిందనేది ఇంకా ధ్రువీకరణ కాకున్నా బయోవార్లో భాగంగానే ఇది డ్రాగన్ చేసిన పని అని ప్రపంచం విశ్వసిస్తోంది. ఇప్పుడు అత్యాధునిక తరహా ఆయుధాలతో చైనా మళ్లీ వార్తల్లో నిలుస్తున్నది.
వాషింగ్టన్ టైమ్స్ ప్రకారం.. చైనా ప్రస్తుతం ‘బయోటెక్నాలజీ’ పేరుతో మనస్సు నియంత్రణ ఆయుధాల శ్రేణిని అభివృద్ధి చేస్తోంది. ఈ ఆయుధాలు శత్రువు మైండ్ను కంట్రోల్ చేస్తాయి. దీనిని ‘మైండ్ కంట్రోల్ వెపన్’ అని పిలుస్తున్నారు. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారనే కారణంతో ఇటీవల యూఎస్ వాణిజ్య విభాగం 12 చైనీస్ ఇన్స్టిట్యూట్లు, సంస్థలను బ్లాక్లిస్ట్ చేయడం ఇందుకు బలం చేకూరుస్తున్నది. ఈ బ్లాక్లిస్ట్ చేసిన ఇన్స్టిట్యూట్లలో ఒకటి బీజింగ్స్ అకాడమీ ఆఫ్ మిలిటరీ మెడికల్ సైన్సెస్.
కాగా, మైండ్ కంట్రోల్ వెపన్స్ గురించి అమెరికా ప్రభుత్వం ఎలాంటి వివరాలను వెల్లడించనప్పటికీ, వాషింగ్టన్ టైమ్స్ ప్రచురించిన 2019 సైనిక పత్రాలు అద్భుతమైన వివరాలను వెల్లడిస్తున్నాయి. చైనా తయారుచేయనున్న మైండ్ కంట్రోల్ వెపన్స్..సాంప్రదాయ ఆయుధాలకు భిన్నంగా పనిచేస్తాయి. సాంప్రదాయ ఆయుధాలు వ్యక్తిని భౌతికంగా గాయపరిస్తే.. ఈ మైండ్ కంట్రోల్ వెపన్స్ శత్రువును మానసికంగా అదుపులోకి తీసుకుంటాయి. శత్రువును కదలకుండా చేస్తాయి. ప్రత్యర్థిని స్తంభింపజేస్తాయి.