న్యూఢిల్లీ : రష్యా దాడితో భీతిల్లిన ఉక్రెయిన్కు మానవతా దృక్పధంతో సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. ఉక్రెయిన్కు భారత్ మందులతో పాటు వైద్య సాయం అందిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి సోమవారం వెల్లడించారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న 1400 మంది భారతీయులను ఆరు విమానాల్లో వెనక్కి తీసుకువచ్చామని చెప్పారు. ఆపరేషన్ గంగలో భాగంగా నాలుగు విమానాలు బుకారెస్ట్ నుంచి రెండు విమానాలు బుడాపెస్ట్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చాయని తెలిపారు.
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను ఖాళీ చేయించే ప్రక్రియకు క్షేత్రస్ధాయి పరిస్ధితులతో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నా ఈ ప్రక్రియను వేగవంతం చేశామని చెప్పారు. కీవ్లో భారత రాయబార కార్యాలయం తొలి మార్గదర్శకాలు జారీచేసినప్పటి నుంచి 8000 మంది భారతీయులు ఉక్రెయిన్ నుంచి తిరుగుముఖం పట్టారని తెలిపారు. మరింత మంది భారతీయులను వెనక్కి రప్పించేందుకు రానున్న 24 గంటల్లో మరో మూడు విమానాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. విమానాల విషయంలో ఇబ్బంది లేదని, భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దును దాటి సురక్షిత ప్రాంతానికి చేరడమే ముఖ్యమని అన్నారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని నాలుగు దేశాలకు ప్రత్యేక దూతలను పంపించాలని భారత్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా ఉక్రెయిన్ వెళ్లనుండగా, కిరణ్ రిజిజు స్లొవక్ రిపబ్లిక్, హర్దీప్ సింగ్ పూరి హంగరి, జనరల్ వీకే సింగ్ పోలండ్ చేరుకుంటారని చెప్పారు. కేంద్ర మంత్రులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉక్రెయిన్లో చిక్కుకున్న భారత విద్యార్ధులు, మన దేశ పౌరులను ఖాళీ చేయించే ప్రక్రియను పర్యవేక్షిస్తారని తెలిపారు. ఈ ప్రక్రియ సాఫీగా సాగేలా కీవ్, బుకారెస్ట్, బుడాపెస్ట్, వార్సాలోని భారత రాయబార కార్యాలయాలు బస్సులను ఏర్పాటు చేశాయని చెప్పారు. ఆయా బస్సుల్లో పశ్చిమ ఉక్రెయిన్కు చేరుకోవాలని తాము విద్యార్ధులకు సూచిస్తున్నామని తెలిపారు. నేరుగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే భారీ క్యూలు, పెద్దసంఖ్యలో ప్రజలు గుమికూడటం వంటి ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.