Taiwan Earthquake | తైపీ, ఏప్రిల్ 3: తైవాన్లో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. 9 మంది ప్రాణాలు కోల్పోగా, 900 మందికిపైగా గాయపడ్డారు. మరో 77 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. హువాలియన్ నగరానికి నైరుతి దిశగా 18 కిలోమీటర్ల దూరంలో, 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు తైవాన్ భూకంప పరిశీలన సంస్థ గుర్తించగా, 7.4 తీవ్రతతో నమోదైనట్టు అమెరికా జియాలాజికల్ సర్వే తెలిపింది. 1999 తర్వాత తైవాన్లో సంభవించిన అతి పెద్ద భూకంపం ఇదే.
భారీ భూకంపం తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం, ప్రకంపనలు సంభవించాయి. భూకంపం ధాటికి తైవాన్ రాజధాని తైపీ సహా అనేక ప్రాంతాల్లో భవనాలు బీటలు వారాయి. హువాలియన్ కౌంటీలో ఐదంతస్థుల భవనం మొదటి అంతస్థ వరకు భూమిలో కూరుకుపోయి 45 డిగ్రీల దశలో పక్కకు ఒరిగింది. భూకంపం నేపథ్యంలో ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసి తర్వాత ఎత్తేసింది. తైవాన్ భూకంపం సంభవించిన 15 నిమిషాల తర్వాత జపాన్లోని యొనగుని ద్వీప తీరాన్ని ఒక అడుగు ఎత్తుతో సునామీ అల తాకిందని ఆ దేశ భూకంప అధ్యయనం కేంద్రం వెల్లడించింది.