కీవ్: ఉక్రెయిన్ నిఘా విభాగం అధిపతి, లెఫ్టినెంట్ జనరల్ కిరిలో బుడనోవ్ భార్యపై మరియా బుడనోవ్పై విష ప్రయోగం జరిగింది. ఆ విషంలో అధిక మోతాదులో లోహాలు ఉన్నట్లు స్పై ఏజెన్సీ ప్రతినిధులు వెల్లడించారు. సాధారణంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై విమర్శలు గుప్పించే, వ్యతిరేకించే వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మరణిస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధం వేళ మరియా బుడనోవ్పై విష ప్రయోగం వార్తలు వెలుగులోకి రావడం సంచనలంగా మారింది.
ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి కిరిలో బుడనోవ్ అధిపతిగా ఉన్నారు. ఆయన భార్య మరియానా బుడనోవ్ కీవ్ మేయర్కు సలహాదారుగా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారని ఉక్రెయిన్ నిఘా సంస్థ ప్రతినిధి యుసోవ్ వెల్లడించారు. అయితే మరియానాపై విషప్రయోగం జరిగిందా..? లేదా..? అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అలాగే నిఘా సంస్థకు చెందిన పలువురు అధికారుల్లో కూడా స్వల్పస్థాయి విష ప్రయోగం లక్షణాలు కనిపించాయని యుసోవ్ తెలిపారు.
నిఘా విభాగం అధిపతి కిరిలో బుడనోవ్ను చేరుకోవడం అసాధ్యం కాబట్టి ఆయన భార్యను లక్ష్యంగా చేసుకున్నారని యుసోవ్ అరోపించారు. ఆ విషంలో మెర్క్యూరీ, ఆర్సెనిక్ ఉన్నాయన్నారు. కాగా ఈ విష ప్రయోగం వెనుక రష్యా హస్తం ఉండి ఉంటుందని ఉక్రెయిన్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై రష్యా నుంచి ఎలాంటి స్పందన రాలేదు.