కరోనా మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి. అదే సమయంలో వైద్యుల పరిశోధనల ప్రకారం, ఒక వ్యక్తి కేలం రెడు డోసుల వ్యాక్సిన్ మాత్రమే తీసుకోవాలి. బూస్టర్ డోసుగా మూడో డోసు తీసుకోవచ్చని చెప్తున్నప్పటికీ.. అన్ని దేశాలూ దీన్ని ఆమోదించలేదు.
చాలా దేశాల్లో ఇప్పటికీ బూస్టర్ డోసుపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఒక్కరోజులో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా పది డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఈ ఘటన న్యూజిల్యాండ్లో వెలుగు చూసింది. సదరు వ్యక్తికి కొంతమంది డబ్బులు ఇచ్చి, తమ తరఫున వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం.
దీంతో ఆ వ్యక్తి ఒక దాని తర్వాత ఒకటిగా వివిధ వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్లి.. తనకు డబ్బులు ఇచ్చిన వాళ్ల పేరున తను వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఇలా చేయడం చాలా పెద్ద తప్పని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తి పేరు ఇంకా తెలియరాలేదు.
ఈ క్రమంలో అతను వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇంత భారీ స్థాయిలో వ్యాక్సిన్ డోసులు తీసుకుంటే ఏమవుతుందో అంచనా వేయడం కష్టమని, సదరు వ్యక్తి వెంటనే వైద్యులను కలవాలని శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు.