బ్రస్సెల్స్ : రైల్వే స్టేషన్లోకి రైలు వస్తుండగా ఒక వ్యక్తి మహిళను పట్టాల మీదకు తోసివేశాడు. అయితే అద`ష్టవశాత్తు ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఒళ్లు జలదరింపజేసే ఈ ఘటన బెల్జియంలో జరిగింది. శుక్రవారం సాయంత్రం బ్రస్సెల్స్లోని రోజియర్ మెట్రో స్టేషన్లో రైలు కోసం ఒక మహిళ ఫ్లాట్ఫామ్పై వేచి ఉన్నది. రైలు స్టేషన్లోకి వస్తుండగా, నల్లటి టీ-షర్టు ధరించిన ఒక వ్యక్తి ఆ మహిళను వెనుక నుంచి రైలు పట్టాల మీదకు తోసేశాడు. అదుపుతప్పిన ఆ మహిళ, స్టేషన్లోకి ఎంట్రన్ అవుతున్న రైలు ముందు ఉన్న పట్టాలపై పడింది.
కాగా, క్షణాల్లో దీనిని గమనించిన రైలు డ్రైవర్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. దీంతో ఆ రైలు మహిళకు అంగుళం దూరంలో ఆగింది. దీంతో ఆమెకు వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పింది. గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే అక్కడకు పరుగున వచ్చారు. షాక్లో ఉన్న ఆ మహిళను ఫ్లాట్ఫామ్పైకి చేర్చేందుకు సహకరించారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు మహిళను ఉద్దేశపూర్వకంగా రైలు ముందుకు తోసిన వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం అతడ్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి మానసిక పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. కాగా, రైల్వే స్టేషన్లోని సీసీటీవీలో రికార్డైన ఈ ఘటనకు సంబంధించి 30 సెకండ్ల నిడివి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.