మాలే, అక్టోబర్ 27: తమ దేశంలో మోహరించిన భారత సైనిక దళాలు వెళ్లిపోవాలని, తాము పూర్తి స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నామని మాల్దీవులకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు పేర్కొన్నారు. లక్షదీవులకు దిగువన ఉండే మాల్దీవుల ప్రాంతంలో ఆధిపత్యం కోసం భారత్, చైనా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం సోలీహ్ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకొనేందుకు భారత్కు అనుమతించాడని, భారత దళాలను అనుమతించడం ద్వారా దేశ సార్వభౌమత్వాన్ని స్వాధీనం చేశాడని ఎన్నికల ప్రచారం సందర్భంగా ముయిజ్జు ఆరోపించారు. దీనిని బట్టి భారత వ్యతిరేకతతోనే ముయిజ్జు ఎన్నికల్లో లబ్ధి పొందినట్టు విదితమవుతున్నది. సైనిక దళాల తొలగింపుపై ఇప్పటికే తాను భారత ప్రభుత్వంతో చర్చించానని, అవి విజయవంతమయ్యాయని ముయిజ్జు చెప్పారు. సుమారు 70 మంది భారత సైనిక సిబ్బంది ఇక్కడ రాడార్ల వ్యవస్థను, నిఘా విమానాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక భారత యుద్ధనౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్లో గస్తీకి సహకరిస్తున్నాయి. భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను కోరుకుంటున్నామని ముయిజ్జు చెప్పారు.