మాలే: మాల్దీవుల్లో వందలాది మంది భారత సైనికులు ఉన్నారన్న అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) వ్యాఖలు వట్టి అబద్ధాలేనని ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ (Abdulla Shahid) అన్నారు. తమ దేశంలో సాయుధులైన విదేశీ సైనికులెవరూ లేరని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేకే ముయిజ్జు ఇలాంటి అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. ఆయన 100 రోజుల పాలనలో అనేక అబద్ధాలను ప్రచారం చేశారని, అందులో ఇదీ ఒకటని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చెప్పారు.
గతంలో అధికారంలో ఉన్న మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ (MDP) వల్లే అనేక మంది భారత సైనికులు దేశంలోకి ప్రవేశించారని ఎన్నికల సమయంలో మయిజ్జు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ నినాదంతో ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేశారని ఎండీపీ విమర్శించింది. అయితే భారత్తో అలాంటి ఒప్పందాలు కుదిరినట్లు అధికారంలోకి వచ్చాక నిరూపించలేకపోతున్నారని అబ్దుల్లా షాహిద్ అన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోతామనే భయంతోనే ముయిజ్జు అదేపనిగా అబద్ధాలు వల్లెవేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
100 days in, it’s clear: President Muizzu’s claims of ‘thousands of Indian military personnel’ were just another in a string of lies. The current administration’s inability to provide specific numbers speaks volumes. There are no armed foreign soldiers stationed in the country.… pic.twitter.com/7q9baIJ6X6
— Abdulla Shahid (@abdulla_shahid) February 25, 2024