ISIS | ఇస్లామాబాద్ : పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. నిఘా వర్గాల సమాచారంతో పంజాబ్ ప్రావిన్స్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ఇద్దరు ఐసీస్ ఉగ్రవాదులను శనివారం అదుపులోకి తీసుకున్నారు.
పంజాబ్ పోలీసు విభాగానికి చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఇద్దరు ఉగ్రవాదులను గుజ్రన్వాలా, రావాల్పిండి ఏరియాల్లో అరెస్టు చేసినట్లు తెలిపారు. ఐసీస్ ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిషేధిత సామాగ్రిని కూడా సీజ్ చేశామన్నారు. పంజాబ్ ప్రావిన్స్ అంతటా విధ్వంసం సృష్టించాలని టెర్రరిస్టులు కుట్ర చేసినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. ఇద్దరు ఉగ్రవాదులను జకీరుల్లా, మహ్మద్ ఈషాగా పోలీసులు గుర్తించారు.
1.5 కిలోల పేలుడు పదార్థాలు, ఎనిమిది డిటోనేటర్లు, 13 ఫీట్ల సేఫ్టీ ఫ్యూజ్ వైర్, నిషేధిత సాహిత్యాన్ని ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిద్దరిపై రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. టెర్రరిస్టులను రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. పంజాబ్ ప్రావిన్స్లో ఎలాంటి విధ్వంసం చోటు చేసుకోకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.