కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మరోసారి అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్నారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నానని ఆయన ప్రకటించారు. శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ (ఎస్ఎల్ఎఫ్పీ) మద్దతుతో తాను పోటీ చేస్తానని చెప్పారు. మైత్రిపాల సిరిసేన గతంలో 2015 నుంచి 2019 వరకు శ్రీలంక అధ్యక్షుడిగా పనిచేశారు.
కాగా, 2024 సెప్టెంబర్లో శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మైత్రిపాల సిరిసేన తాజా ప్రకటన చేశారు. ‘ఏదేమైనా నేను వెనుదిరగను. ఎలాంటి కుట్రలకైనా నేను భయపడను. చట్టాన్ని, న్యాయస్థానాన్ని నేను గౌరవిస్తా. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో నేను శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ తరఫున బరిలో దిగబోతున్నా’ అని వ్యాఖ్యానించారు.
శ్రీలంకలో 2019లో జరిగిన ఈస్టర్ పండుగ సందర్భంగా క్రిస్టియన్లపై దాడులు చోటుచేసుకున్నాయి. ఆ దాడుల్లో బాధితులు తీవ్రంగా నష్టపోయారు. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం శ్రీలంక సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్పై విచారణ జరిపిన శ్రీలంక సుప్రీంకోర్టు.. బాధితులకు జరిగిన నష్టానికిగాను 10 కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లించాలని నాటి అధ్యక్షుడు సిరిసేనను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.