జకార్తా: ఇండోనేషియాలోని సులవేసిలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున సులావేసిలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. సులవేసి ప్రావిన్స్కి ఉత్తరాన 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొరొన్టాలోలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. సముద్రంలో 145 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దీనివల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
కాగా, రెండో రోజుల క్రితం కూడా ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. సోమవారం ఉదయం 6:30 గంటలకు సుమత్రా దీవుల్లో భూమి కంపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదయింది. అంతకుముందు వారం రోజుల క్రితం తనింబర్ ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూమి కంపించింది. సులవేసిలో 2018లో సంభవించిన భూకంపం, సునామీ వల్ల 4,340 మంది మరణించారు.