జెరూసలెం : ఇరాక్, సిరియాలో ఐసిస్తో పోరాడుతున్న అంతర్జాతీయ సంకీర్ణ కూటమిని హమాస్తో పోరాడేందుకు విస్తరించాలని ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ (Macron) మంగళవారం పిలుపు ఇచ్చారు. పాలస్తీనా శాంతి ప్రక్రియను నిర్ణాయక దశకు తీసుకువచ్చేందుకు పునరుద్ధరించాలని కోరారు. మీరు ఏకాకులు కాదని సంయుక్త విలేకరుల సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశించి మాక్రాన్ పేర్కొన్నారు.
ఐసిస్తో పోరాడుతున్న దేశాలు హమాస్పై కూడా పోరాడాలని కోరారు. ఉగ్ర సంస్ధపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించడం, ఇజ్రాయెల్ పౌరుల పట్ల హమాస్ వేధింపుల నేపధ్యంలో పాలస్తీనా శాంతి ప్రక్రియను నిర్ణాయక దశకు చేర్చేందుకు ఈ ప్రక్రియను పునరుద్ధరించాలని కోరారు. హమాస్పై ఇజ్రాయెల్ పోరుకు ఫ్రాన్స్ బాసటగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కాగా, గాజాలో మిలిటెంట్ గ్రూప్ హమాస్ (Israel-Hamas War) లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. 400 మిలిటెంట్ టార్గెట్లపై ఫోకస్ చేస్తూ దాడులను తీవ్రతరం చేసింది.
సోమవారం రాత్రి నుంచి కొనసాగుతున్న దాడుల్లో డజన్ల కొద్దీ హమాస్ ఫైటర్లను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. వీరిలో ముగ్గురు డిప్యూటీ బెటాలియన్ కమాండర్లు ఉన్నారని వెల్లడించింది. సముద్రం నుంచి సొరంగ మార్గం ద్వారా ఇజ్రాయెల్లోకి చొచ్చుకువచ్చేందుకు హమాస్కు సహకరించే టన్నెల్తో పాటు మసీదుల్లో హమాస్ కమాండ్ సెంటర్లను ధ్వంసం చేశామని పేర్కొంది. మరోవైపు హమాస్తో యుద్ధంలో భాగంగా గాజా స్ట్రిప్పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
Read More :
Sri Lanka | శ్రీలంక కీలక నిర్ణయం.. భారత్ సహా 7 దేశాల టూరిస్ట్లకు వీసా ఫ్రీ ఎంట్రీ