బీజింగ్: చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. రెండేండ్ల గరిష్ఠస్థాయికి కేసులు చేరాయి. దీంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తున్నది. 90 లక్షల జనాభా ఉన్న చాంగ్చున్ నగరంలో లాక్డౌన్ ప్రకటించారు. దీంతో ప్రజలు ఇండ్లకే పరిమితం కానున్నారు. శుక్రవారం దేశవ్యాప్తంగా 397 కేసులు నమోదయ్యాయి. అందులో జిలిన్ ప్రావిన్సులో 98 కేసులు నమోదయ్యాయి. చాంగ్చున్ సిటీలో రెండే కేసులు వచ్చినప్పటికీ నగరంలో లాక్డౌన్ విధించడం గమనార్హం. కొవిడ్పై జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రభు త్వం అవలంబిస్తున్నది. అందులో భాగంగానే ఒకటి రెండు కేసులు నమోదైనా కఠిన ఆంక్షలు విధిస్తున్నది.
మూడు వారాల్లో 60వేల మందికిపైగా
హాంకాంగ్లోనూ కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతున్నది. రోజువారీ కేసులు 30 వేలకు పైగా నమోదవుతున్నాయి. రోజుకు 200 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చైనా మాదిరిగానే హాంకాంగ్ కూడా జీరో టోలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నది. కఠిన ఆంక్షలు విధిస్తున్నది. అయినా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత మూడు వారాల్లో 60 వేల మందికిపైగా నగరాన్ని విడిచివెళ్లడం అక్కడి పరిస్థితిని తెలియజేస్తున్నది.
లెక్కకురాని కరోనా మరణాలు భారత్లోనే ఎక్కువ: లాన్సెట్
భారత్లో కరోనా మరణాల లెక్కల విషయంలో చాలా వ్యత్యాసముందని ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్ వెల్లడించింది. 2020 జనవరి నుంచి 2021 డిసెంబర్ వరకు లెక్కల్లో చూపిన మరణాలకంటే అదనంగా దాదాపు 47 లక్షల మరణాలు చోటుచేసుకున్నట్టు గుర్తించామని తెలిపింది. ఈ అదనపు మరణాల విషయంలో భారత్ ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచిందని పేర్కొంది. అయితే ఈ లెక్కలను కేంద్ర ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది. మరణాల లెక్కింపునకు శాస్త్రీయ పద్ధతిని అవలంబించలేదని, ఊహాగానాలతో ఈ లెక్కలను అంచనా వేసినట్టు తెలుస్తున్నదని వెల్లడించింది.