కరోనా కట్టడికి న్యూజిలాండ్ కఠిన నిర్ణయం
వెల్లింగ్టన్, ఆగస్టు 17: కరోనా మహమ్మారిని సమర్థంగా నిలువరించిన న్యూజిలాండ్.. కొత్తగా ఒక కరోనా కేసు నమోదుకావడంతో అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా మూడు రోజులపాటు కఠిన లాక్డౌన్ అమలుచేయనున్నట్టు ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు. ఆక్లాండ్కు చెందిన 58 ఏండ్ల వ్యక్తికి వైరస్ సోకిందని, అతడు కోరమాండెల్లో తిరిగినట్టు చెప్పారు. ఆక్లాండ్, కోరమాండెల్లో 7 రోజులు, దేశవ్యాప్తంగా 3 రోజులు లాక్డౌన్ విధిస్తున్నట్టు తెలిపారు. వైరస్ దేశంలోకి ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. లాక్డౌన్ ప్రకటనతో ప్రజలు సూపర్మార్కెట్ల ఎదుట బారులు తీరారు. దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో చివరిసారిగా వైరస్ కేసులు కనిపించాయి. ప్రభుత్వ పటిష్ఠ చర్యలతో ఆ తర్వాత కేసుల మాటే లేదు. అయితే, అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో పోలిస్తే న్యూజిలాండ్లో టీకా ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నది. ఇప్పటివరకు 18% జనాభాకు మాత్రమే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. 32% మంది ఒకే డోసు తీసుకున్నారు.