మాడ్రిడ్: ఎన్నికలంటేనే ఓ ప్రహసనం. అందులోనూ పోలింగ్ అయితే అటూఇటుగా 10 నుంచి 12 గంటలపాటు సాగే వ్యవహారం. ఒక్కోచోట అయితే అర్ధరాత్రి దాటినా పోలింగ్ ముగియదు. అయితే ఆ ఊర్లో ఓటింగ్ తంతు ముగియడానికి అర నిమిషం కూడా పట్టలేదు. కేవలం 29 సెకన్లలోనే ఓట్లర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ వాస్తవమే.. అయితే ఆ గ్రామంలో ఓటర్లు ఉన్నది మాత్రం ఏడుగురే. ఇది జరిగింది స్పెయిన్లోని (Spain) లా రియోజా ప్రావిన్స్లో.
లా రియోజా ప్రావిన్స్లోని (La Rioja province) విల్లారోయా (Villaroya) గ్రామంలో స్థానిక ఎన్నికలు (Local Elections) జరుగుతున్నాయి. ఏడుగురు మాత్రమే ఓట్ల కోసం తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో అధికారులు వారికి ఓటు హక్కు కల్పించారు. పోలింగ్ తేదీ రానేవచ్చింది. ఓటర్లంతా పోలింగ్ ప్రారంభమైన 29 సెకన్లలోనే ఓటేశారు. దీంతో అప్పటివరకూ ఉన్న 32 సెకన్ల రికార్డును వారు చెరిపివేశారని స్థానిక మేయర్ సాల్వడార్ పెరెజ్ (Mayor Salvador Perez) అన్నారు. అయితే వారు ఎవరికి వేశారో తెలియనప్పటికీ.. తనకే ఆ ఓట్లన్నీ వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఓటు ఎలా వేయాలనే విషయంలో ఇప్పటికే వారు శిక్షణ తీసుకున్నారని చెప్పారు. కాగా, ఆయన 1973 నుంచి ఆ గ్రామానికి మేయర్గా ఎన్నికవుతూ వస్తుండటం విశేషం. ఈ ఏడాది చివర్లో జరుగనున్న పార్లమెంటు ఎన్నికలకు స్థానిక ఎన్నికలను రెఫరెండంగా భావిస్తారు.