ఇస్లామాబాద్: అక్రమ వలసదారులకు (illegal immigrants ) పాకిస్థాన్ వార్నింగ్ ఇచ్చింది. నవంబర్ 1లోగా దేశం నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని గురువారం అల్టిమేటమ్ జారీ చేసింది. లేనిపక్షంలో వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే అక్రమ వలసదారులకు షెల్టర్ ఇచ్చిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని పేర్కొంది. ఆ దేశ తాత్కాలిక అంతర్గత మంత్రిత్వ శాఖ గురువారం ఈ మేరకు ప్రకటించింది.
కాగా, పాకిస్థాన్లోని వేలాది మంది ఆఫ్ఘన్ జాతీయులతో సహా అక్రమంగా దేశంలో ఉంటున్న వలసదారులంతా నవంబర్ 1 గడువు కంటే ముందే స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని తాత్కాలిక అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. నవంబరు 1 తర్వాత పత్రాలు లేని వలసదారులందరినీ తొలగించే ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పాకిస్థాన్ కృతనిశ్చయంతో ఉందని మీడియాతో అన్నారు. అక్రమ వలసదారులను గుర్తించామని, వారి సమాచారం తమ వద్ద ఉందని వెల్లడించారు. స్వచ్ఛందంగా వెళ్లే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు.
మరోవైపు ఈ ఏడాది పాకిస్థాన్లో 24 ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయి. అలాగే ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా జరిగిన 14 దాడులు, పలు నేరాలు, స్మగ్లింగ్ కార్యకలాపాల్లో ఆఫ్ఘన్ జాతీయుల ప్రమేయం ఉన్నట్లు పాకిస్థాన్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారులను దేశం నుంచి వెళ్లగొట్టే ప్రణాళికపై పాకిస్థాన్లోని తాత్కాలిక ప్రభుత్వం దృష్టిసారించింది.