కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా బలగాల ( US Troops ) ఉపసంహరణ ముగిసింది. బలగాల ఉపసంహరణను పెంటగాన్ ధ్రువీకరించింది. ఈ నెల 31వ తేదీలోగా బలగాల ఉపసంహరణ పూర్తవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా సేనలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి వెళ్లిపోయాయి. ఆఫ్ఘన్లో 20 ఏండ్ల పాటు అమెరికా సేనలు తాలిబన్లపై పోరాడాయి. తాలిబన్లు కాబూల్ను ఆక్రమించడంతో అమెరికా సేనల ఉపసంహరణ ప్రారంభమైంది. కాబూల్ నుంచి అర్ధరాత్రి బయల్దేరిన అమెరికా చివరి విమానంలో అమెరికా కమాండర్, రాయబారి ఉన్నారు. కాబూల్ నుంచి వెళ్లిపోవాలనుకునే వారికి విమానాశ్రయం తెరిచే ఉంచాలని బైడెన్ కోరారు. అమెరికా చివరి విమానం వెళ్లిన తర్వాత తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపి సంబురాలు చేసుకున్నారు. బలగాల ఉపసంహరణతో పూర్తి స్వాతంత్ర్యం వచ్చిందని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ నెల 15వ తేదీన కాబూల్ను తాలిబన్లు ఆక్రమించిన విషయం విదితమే.
ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రముఠాలకు స్థావరం కాకూడదని ఐక్య రాజ్య సమితి తీర్మానం చేసింది. తాలిబన్లు ఇతర దేశాలపై దాడులు చేయకూడదని తీర్మానించింది. తీర్మానం ఓటింగ్కు రష్యా, చైనా దూరంగా ఉన్నాయి.