Landslide @ Colombia | దక్షిణ అమెరికా దేశంలోని కొలంబియాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 34 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 8 మంది పిల్లలు ఉన్నారు. శిథిలాల నుంచి కూరుకుపోయిన వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్లు నిమగ్నమై ఉన్నాయి. ఇప్పటివరకు ఓ 7 ఏండ్ల బాలికను సురక్షితంగా బయటకు తీసినట్లు సమాచారం. బస్సుపై కొండ చరియలు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.
కొలంబియాలోని రిసరాల్డా ప్రావిన్స్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు బస్సుపై పడటంతో 34 మంది మరణించారు. చనిపోయిన వారిలో ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. నేషనల్ యూనిట్ ఫర్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నది. భారీ వర్షాలు కురియడంతో రిసరాల్డా ప్రావిన్స్లో కొండచరియలు విరిగిపడినట్లు అధికారి ఒకరు తెలిపారు. బస్సుతో పాటు మరికొన్ని వాహనాలు కూడా శిథిలాల్లో కూరుకుపోయాయి. ప్రమాదానికి గురైన బస్సు కాలి నగరం నుంచి చోకో ప్రావిన్స్లోని కాండోటో నగరానికి వెళ్లున్నది. ప్యూబ్లో రికో-శాంటా సిసిలియా మధ్య ప్రమాదం జరిగింది.
కొండ చరియలు ఒక్కసారిగా కూలిపోవడంతో బస్సుతోపాటు ఇతర వాహనాల్లో ఉన్న వారు పారిపోయేందుకు సమయం దొరకలేదని పత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. తొలుత ఒక కారు, ఆ వెనకే బస్సు, బైకు, మరో కారు వచ్చాయని, ఇవన్నీ శిథిలాల కింద కూరుకుపోయినట్లు ఆయన తెలిపారు. ఏడేండ్ల బాలిక శిథిలాల నుంచి సజీవంగా బయటపడింది. కాగా, ఆమె తల్లి ఈ ప్రమాదంలో మరణించింది. ప్రస్తుతం 9 మందిని రక్షించినట్లు రెస్క్యూ టీమ్ అధికారి తెలిపారు. ఈ ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలువనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.