Lancet study : ప్రపంచవ్యాప్తంగా ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2020 నుంచి 2040 మధ్య ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు రెట్టింపయ్యే అవకాశం ఉందని ప్రముఖ వైద్య పత్రిక ‘ది లాన్సెట్’ ప్రచురించింది. 2020 నుంచి 2040 మధ్య కాలంలో ప్రొస్టేట్ క్యాన్సర్ బారినపడి మరణించే వారి సంఖ్య కూడా 85 శాతం పెరగవచ్చని అధ్యయనం అంచనావేసింది.
అల్ప, మధ్య ఆదాయ దేశాలపై ప్రొస్టేట్ క్యాన్సర్ భారం ఎక్కువగా ఉంటుందని లాన్సెట్ తెలిపింది. మెరుగుపడుతున్న సగటు ఆయుర్దాయంతో జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతోందని, ఈ వయోధికుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. 50 ఏళ్లు దాటిన పురుషులకు ఈ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
కేసుల పెరుగుదలకు ఉన్న ఆస్కారాన్ని పరిగణనలోకి తీసుకొని, ముందస్తు చర్యలు చేపట్టాలని లాన్సెట్ పరిశోధకులు సూచించారు. ఈ రుగ్మతను త్వరగా గుర్తించడం, ప్రజల్లో అవగాహన పెంచడం లాంటివి చేయాలని కోరారు. ప్రొస్టేట్ క్యాన్సర్కు సంబంధించిన లక్షణాలపై పేద, మధ్య ఆదాయ దేశాల్లోని వారికి సరైన అవగాహన ఉండదని అభిప్రాయపడ్డారు.
వెన్నుకు ఈ క్యాన్సర్ పాకడంవల్ల ఎముకల్లో తలెత్తే నొప్పి వంటి వాటిని వీరు సరిగా విశ్లేషించుకోలేరని పరిశోధకులు తెలిపారు. పేద దేశాల్లో చికిత్సకు అవకాశాలను పెంచాలని కోరారు. ప్రస్తుతం ఏటా 14 లక్షల మంది ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నారని, 2020లో ఈ రుగ్మత కారణంగా 3.75 లక్షల మంది మరణించారని చెప్పారు. 2040 నాటికి ఏటా నమోదయ్యే కేసుల సంఖ్య 29 లక్షలకు, మరణాల సంఖ్య 7 లక్షలకు పెరగవచ్చని వారు అంచనా వేస్తున్నారు.