రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతూనే వుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోకి రష్యా భద్రతా బలగాలు ప్రవేశించాయన్న వార్తల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వం స్పందించింది. కీవ్ పూర్తిగా తమ ఆధీనంలోనే ఉందని ఉక్రెయిన్ డిప్యూటీ హెడ్ అడ్మినిస్ట్రేషన్ మైకోలా పోవోరోజ్నిక్ ప్రకటించారు. కీవ్లో పరిస్థితి చాలా ప్రశాంతంగానే వుంది. రాజధాని మొత్తం ఉక్రెయిన్ ఆర్మీ దళాల ఆధీనంలోనే ఉంది. పరిస్థితి పూర్తిగా మా అదుపులోనే ఉంది అని డిప్యూటీ హెడ్ అడ్మినిస్ట్రేషన్ మైకోలా పోవోరోజ్నిక్ ప్రకటించారు. అలాగే.. తమపై దాడులు చేయడానికి వచ్చిన రష్యా దళాలను ఉక్రెయిన్ ఆర్మీ అదుపులోకి తీసుకుందని కూడా ఆయన ప్రకటించారు.
ఉక్రెయిన్పై దండయాత్రకు శ్రీకారం చుట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. శాంతి చర్చలకు సిద్ధం అని రష్యా ప్రకటించినా.. ఉక్రెయిన్ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్పై దాడులు తీవ్రతరం చేయాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు.అన్ని వైపుల నుంచి దాడులు తీవ్రతరం చేయాలని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు రష్యా సైన్యం ప్రయత్నాలు చేస్తున్నది. మరోవైపు, ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి రష్యా భారీగా సైన్యాన్ని తరలిస్తున్నది.