King Charles | క్యాన్సర్ బారిన పడ్డ బ్రిటన్ రాజు చార్లెస్-3 (King Charles III) తొలిసారి బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. ఈస్టర్ వేడుకల్లో భాగంగా విండ్సర్ క్యాజిల్ లో పర్యటించారు. తన సతీమణి రాణి క్యామిల్లా (Queen Camilla)తో కలిసి ఈస్టర్ వేడుకలకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు. ఈస్టర్ వేడుకల్లో పాల్గొనేందుకు సెయింట్ జార్జ్ చాపెల్ కు వచ్చిన చార్లెస్ దంపతులు సాధారణ పౌరులతో ఉల్లాసంగా గడిపారు. తన మద్దతుదారులతో కరచాలనం చేస్తూ పరిసరాల్లో కలియ తిరిగారు. అభిమానులతో ముచ్చట్లూ చెప్పారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల ఉన్న ప్రజలు రాజు చార్లెస్ను ఉద్దేశిస్తూ.. ‘ధైర్యంగా ఉండండి’ అని నినాదాలు చేశారు. క్యాన్సర్ బారీన పడినట్లు వ్యాధి నిర్ధారించిన తర్వాత ఇప్పుడిప్పుడే చార్లెస్ రాజు కోలుకుంటున్నారు.
ఇదిలా ఉంటే వీరితోపాటు ప్రిన్స్ విలియమ్స్, సతీమని కేట్ మిడిల్టన్ మాత్రం ఈస్టర్ వేడుకల్లో కనిపించ లేదు. కేట్ మిడిల్టన్ కూడా క్యాన్సర్ బారీన పడ్డారని ఇటీవల బకింగ్ హం ప్యాలెస్ వెల్లడించింది. ఆమెకు సర్జరీ పూర్తయిందని, ప్రస్తుతం కోలుకుంటున్నారని పేర్కొంది. బ్రిటన్ రాజ కుటుంబంలో ఇద్దరు క్యాన్సర్ బారీన పడటంతో బ్రిటన్ వాసులు ఆందోళన చెందుతున్నారు.