సియోల్: తమను రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోవాలని ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అమెరికా, దక్షిణకొరియాను హెచ్చరించారు. లేదంటే ఆ రెండు దేశాలను పూర్తిగా నిర్మూలిస్తామని హెచ్చరికలు జారీచేశారు. అమెరికా, సౌత్ కొరియా మిలటరీ డ్రిల్స్ నేపథ్యంలో కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే కనుక యూఎస్-నార్త్ కొరియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరిగే అవకాశం ఉండటంతో ఆయుధ పరీక్షలను మరింత ముమ్మరం చేయాలని కిమ్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. గతవారం 5 రోజులపాటు జరిగిన అధికార పార్టీ సమావేశంలో కిమ్ మాట్లాడుతూ.. మరో మూడు మిలటరీ గూఢచార ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్టు తెలిపారు. అలాగే, మరిన్ని అణు పరీక్షలతోపాటు అటాకింగ్ డ్రోన్లను ఉత్పత్తి చేస్తామని చెప్పిన విషయం బయటకు వచ్చింది. కమాండింగ్ అధికారులతో ఆదివారం జరిగిన సమావేశంలో కిమ్ మాట్లాడుతూ జాతీయ భద్రతను కాపాడేందుకు అవసరమైతే అణ్వాయుధాలను వాడడానికి కూడా వెనుకాడబోమని తెగేసి చెప్పారు. తమకు వ్యతిరేకంగా సైనిక ఘర్షణలకు రెచ్చగొడితే వారిని పూర్తిగా నిర్మూలిస్తామని హెచ్చరించారు.