ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా మంగళవారం హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించిన విషయం తెలిసిందే. అయితే ఆ పరీక్షను ఆ దేశ నేత కిమ్ జాంగ్ ఉన్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ విషయాన్ని ఉత్తర కొరియా మీడియా పేర్కొన్నది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా రిలీజ్ చేసింది. హైపర్సోనిక్ క్షిపణి సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను తాకినట్లు మీడియా వెల్లడించింది. ఇటీవల నార్త్కొరియా జరిపిన మూడవ హైపర్సోనిక్ మిస్సైల్ ఇది. కిమ్ ప్రత్యక్షంగా పరీక్షను వీక్షించడం .. క్షిపణి టెక్నాలజీ పురోగతికి నిదర్శనంగా నిలుస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గత పరీక్షలతో పోలిస్తే, ఈసారి హైపర్సోనిక్ పరీక్షతో మరింత పురోగతి సాధించినట్లు ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. తాజా పరీక్షలో గ్లైడెడ్ మిస్సైల్ను వాడారు. తొలుత గ్లైడ్ జంప్ ఫ్లయిట్ సుమారు 600 కిలోమీటర్లు వెళ్లింది. ఆ తర్వాత మాన్యువోరింగ్ ద్వారా మరో 240 కిలోమీటర్ల దూరం మిస్సైల్ వెళ్లినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది.