సియోల్: ఉత్తర కొరియాలో (North Korea) మొదటిసారిగా కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళనృత్యం చేసినప్పటికీ.. ఉత్తర కొరియాలో మాత్రం ఒక్క పాజిటివ్ కేసు నమోదవలేదు. అయితే దేశంలో మొదటి కరోనా కేసు గురువారం నమోదయింది. దీంతో దేశంలో తీవ్రమైన జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది.
దేశంలోని ప్యోంగ్యాంగ్లో జ్వరంతో బాధపడుతున్న రోగుల నమూనాలను వైద్యులు పరీక్షించారు. వారిలో ఒకరికి కరోనా వేరియంట్ ఒమిక్రాన్ సోకిందని తేలింది. ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించింది. దీంతో వైరస్ వ్యాప్తిచెందకుండా అధ్యక్షుడు కిమ్ దేశవ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. తక్కువ వ్యవధిలోనే కరోనా మూలాలను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు.
కాగా, 2020, జనవరి 3 నుంచి ఈ ఏదడాది మే 11 వరకు ఉత్తరకొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.