ఇస్లామాబాద్: వందకుపైగా పాకిస్థాన్ సైనికులను హతమార్చినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. గురువారం రెండు పాక్ సైనిక శిబిరాలపై దాడి చేసినట్లు తెలిపింది. పాకిస్థాన్లోని పంజ్గూర్, నుష్కీ సైనిక శిబిరాల్లోని ప్రధాన భాగాలు తమ ఆధీనంలో ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటనను గురువారం విడుదల చేసింది. ‘పాకిస్థాన్ శిబిరాల్లో చాలా భాగం పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదనపు సైనిక దళాలు వచ్చినప్పటికీ మా స్థానాలను నాశనం చేయడంలో విఫలమయ్యాయి’ అని అందులో పేర్కొంది.
అంతేగాక ఈ వార్తలు ప్రసారం కాకుండా మీడియాపై పాకిస్థాన్ నిషేధం విధించిందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆరోపించింది. టెలీ కమ్యూనికేషన్ నెట్వర్క్లను కూడా డిస్కనెక్ట్ చేశారని విమర్శించింది. దాడులను తిప్పికొట్టినట్లుగా పాక్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ చేసిన వాదన అబద్ధమని ఆ తీవ్రవాద సంస్థ పేర్కొంది. పాకిస్థాన్ సైనిక శిబిరాలపై తమ దాడులు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయని వెల్లడించింది.
మరోవైపు పాకిస్థాన్ ఆర్మీ మీడియా విభాగం కూడా గురువారం ఉదయం ఒక ప్రకటన చేసింది. బలూచిస్థాన్ ప్రావిన్స్లో రెండు సైనిక శిబిరాలపై తీవ్రవాదులు దాడి చేసినట్లు తెలిపింది. ఇరువైపులా భీకరంగా కాల్పులు జరిగాయని, నలుగురు తీవ్రవాదులతోపాటు ఒక సైనికుడు మరణించినట్లు పేర్కొంది. రెండు శిబిరాలపై దాడులను సైన్యం ధీటుగా తిప్పికొట్టిందని, తీవ్రవాదులు చాలా మంది చనిపోయి ఉండవచ్చని ప్రకటించింది.
అయితే దీనికి పూర్తి విరుద్ధంగా బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) వాదన ఉన్నది. బలూచిస్థాన్ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ఈ మిలిటెంట్ సంస్థ, ఇటీవల దాడులను తీవ్రం చేసింది. పాకిస్థాన్ సైనికుల లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నది. గత వారం కెచ్ జిల్లాలోని చెక్పోస్ట్ వద్ద బీఎల్ఏ జరిపిన దాడిలో పది మంది పాక్ సైనికులు మరణించారు.