ఓక్లహామా, మార్చి 17: ఓ వ్యక్తి ఓ మహిళను హత్య చేసి ఆమె గుండెను ఆలు గడ్డలతో కలిపి కూర వండిన భయంకరమైన నేరం అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రంలో చోటు చేసుకుంది. స్థానిక మీడియా కథనం ప్రకారం లారెన్స్ పాల్ అండర్సన్ 2021లో ఈ నేరానికి పాల్పడ్డాడు. అండ్రియా బ్లాకెన్షిప్ అనే మహిళను చంపి ఆమె గుండెను తన మామ ఇంటికి తీసుకెళ్లి అక్కడే వంట చేశాడు. ఆ భయంకరమైన వంటకాన్ని తన అత్త, మామలకు వడ్డించేందుకు ప్రయత్నించాడు. కానీ అది విఫలం కావడంతో తన మామ లియన్ (67)ను, ఆయన మనుమరాలు కాయిస్ యేట్స్(4)ను కత్తితో పొడిచి చంపాడు. ఒక డ్రగ్ కేసులో 20 ఏండ్లు జైలు శిక్ష పడిన అండర్సన్ మూడేండ్ల తర్వాత విడుదలైనప్పుడు ఈ హత్యలకు పాల్పడ్డాడు. అతడికి పెరోల్ ఇచ్చిన ఓక్లహామా గవర్నర్పైన, జైలు పెరోల్ బోర్డుపైన అండర్సన్ అత్త కేసు వేశారు. ఆమె అండర్సన్ చేసిన దాడిలో గాయపడ్డారు. హత్య, దాడి నేరాన్ని అంగీకరించిన దోషికి కోర్టు ఇటీవల అయిదు సార్లు జీవిత ఖైదు విధించింది.