వాషింగ్టన్/మామిళ్లగూడెం, నవంబర్ 1: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన 24 ఏండ్ల తెలంగాణ విద్యార్థిపై దాడి జరిగింది. ఇండియానా రాష్ట్రం వాల్పరైసో నగరంలోని పబ్లిక్ జిమ్లో వరుణ్ రాజ్పై ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన వరుణ్ను దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. ఖమ్మంలోని బుర్హాన్పురంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుచ్చా రామ్మూర్తి కుమారుడు వరుణ్ అమెరికాలో ఎంఎస్ చదువుతూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. జిమ్లో ఉండగా, జోర్డాన్ ఆండ్రాడే అనే వ్యక్తి ఆదివారం కత్తితో వరుణ్పై దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. తనపై దాడికి వస్తున్నాడని భావించి వరుణ్పై కత్తితో హత్యాయత్నం చేసినట్టు నిందితుడు పోలీసులకు తెలిపాడు. వరుణ్ రాజ్ను ఫోర్ట్ వేన్లోని లూథరన్ దవాఖానకు తరలించారు.
స్పందించిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ
వరుణ్పై దాడి విషయం తెలిసి తల్లిదండ్రులు తల్లడిల్లారు. తాము అమెరికా వెళ్లేందుకు సహకరించాలని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను బుధవారం స్వయంగా కలిసి కోరినట్టు బాధితుడి తండ్రి రామ్మూర్తి తెలిపారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి భరోసా కల్పించారు. అలాగే ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్టు చేయడంతో గమనించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. బాధిత కుటుంబం అమెరికా వెళ్లేందుకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే అమెరికాలోని భారత ఎంబసీ, తెలంగాణ ఎన్ఆర్ఐల ద్వారా వరుణ్ రాజ్కు అవసరమైన సహాయాన్ని అందిస్తానని భరోసా కల్పించారు.