Justin Trudeau : భారత్-కెనడా సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న సమయంలో ఇరు దేశాల అధినేతలు కలుసుకున్నారు. జీ-7 దేశాల సదస్సు సందర్భంగా ఇటలీలో ఇద్దరూ భేటీ అయ్యారు. భేటీ అనంతరం కెనడా ప్రధాని జస్టిన్ జస్టిన్ ట్రూడో (Justin Trudeau) మాట్లాడుతూ.. ముఖ్యమైన అంశాలపై భారత్తో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన సున్నితమైన అంశాల జోలికి తాను వెళ్లడం లేదని, అయితే కలిసి పని చేయడానికి కట్టుబడి ఉన్నామని ట్రూడో చెప్పారు. భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పనులను తాము డీల్ చేస్తామని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ కెనడా ప్రధాని ట్రూడోతో కరచాలనం చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను జీ7 సదస్సులో కలిశాను’ అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ జతచేశారు.
మరోవైపు కెనడా ప్రధాని కార్యాలయం కూడా దీనిపై స్పందించింది. ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలపై సంక్షిప్తంగా చర్చించారని పేర్కొంది. మోదీ తిరిగి ప్రధానిగా ఎన్నిక కావటంతో ట్రూడో శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించింది. జీ20 సదస్సు తర్వాత కెనడా ప్రధాని భారత్పై నేరుగా ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్నాయి.
గత ఏడాది జులై 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య జరిగింది. దీని వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. తగిన ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని పలుమార్లు స్పష్టం చేసింది. కేసులో తాజాగా ఎడ్మంటన్ ప్రాంతంలో నివాసం ఉండే కరణ్ప్రీత్ సింగ్ (28), కమల్ప్రీత్ సింగ్ (22), కరణ్ బ్రార్ (22) లను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు.