బీజింగ్: చైనాలో ఉన్న ఏకైక భారతీయ జర్నలిస్టు(Indian journalist) తమ దేశం నుంచి వెళ్లిపోవాలని డ్రాగన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పీటీఐ రిపోర్టర్ ఒకరు అక్కడే ఉన్నారు. అయితే వీసా పూర్తి అయిన తర్వాత ఆ రిపోర్టర్ ఈ నెలాఖరులోగా చైనాను విడిచి పెట్టి రానున్నారు. రెండు దేశాల మధ్య మీడియా సిబ్బంది విషయంపై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. లడాఖ్, సిక్కిం వద్ద జరిగిన ఘర్షణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
చైనాలో ఉన్న ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు వీసా రెన్యూవల్ చేసేందుకు ఇటీవల ఆ దేశం నిరాకరించింది. ఇండియాలో ఉన్న ఇద్దరు చైనా జర్నలిస్టులకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్ జరిగిందని, అందుకే ఇండియన్లకు చైనా వీసా రెన్యూవల్ చేసేందుకు వ్యతిరేకిస్తున్నది. హిందుస్థాన్ టైమ్స్కు చెందిన ఓ రిపోర్టర్ గత ఆదివారమే చైనా వదిలి వచ్చేశారు. దూరదర్శన్, ద హిందూకు చెందిన రిపోర్టర్లను ఏప్రిల్లోనే పంపించేశారు.