అమ్మాన్: అరబ్ దేశమైన జోర్డాన్, ఇరాన్కు షాక్ ఇచ్చింది. ఆ దేశ డ్రోన్లు కూల్చివేతలో ఇజ్రాయెల్కు సహకరించింది. దీంతో జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా నిర్ణయంపై ముస్లింలు మండిపడుతున్నారు. (Jordan Shocks Iran) అంతా ఊహించినట్లుగానే సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై దాడికి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్పై వందలాది క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. అయితే ఇరాన్ నుంచి దూసుకొచ్చిన డ్రోన్లు, క్షిపణులను ఇజ్రాయెల్ సమర్థంగా ఎదుర్కొంది. బహుళ అంచెల రక్షణ వ్యవస్థ ద్వారా వాటిని కూల్చివేసింది.
కాగా, పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఖండించిన జోర్డాన్ అనూహ్యంగా ఆ దేశానికి మద్దతు ఇచ్చింది. తమ భూభాగం మీదుగా ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్లే డ్రోన్లను జోర్డాన్ ఆర్మీ కూల్చివేసింది. ఇరాన్కు షాక్ ఇచ్చిన జోర్డాన్ చర్య అరబ్ దేశాలకు ఆశ్చర్యం కలిగించింది. ఈ నేపథ్యంలో జోర్డాన్ తీరుపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు ఇరాన్ డ్రోన్లను కూల్చివేతపై జోర్డాన్ వివరణ ఇచ్చింది. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అంతే తప్ప ఇజ్రాయెల్కు సహాయం చేయడానికి కాదని వివరించింది.
జోర్డాన్ విదేశాంగ మంత్రి ఐమన్ సఫాది దీని గురించి మాట్లాడారు. తాము ఫైర్ రేంజ్లో ఉన్నట్లు తెలిపారు. ‘ఏదైనా క్షిపణి లేదా డ్రోన్ జోర్డాన్ భూభాగంలో పడితే మాకు హాని కలుగుతుంది. అందుకే మేం చేయాల్సింది చేశాం. ఇరాన్, ఇజ్రాయెల్ లేదా మరే దేశం వైపు నుంచి డ్రోన్లు, క్షిపణులు వచ్చినా అదే పని చేస్తాం’ అని అన్నారు.
కాగా, ఆర్థికంగా, సైనికపరంగా బలహీనమైన జోర్డాన్ 309 కిలోమీటర్ల మేర ఇజ్రాయెల్తో సరిహద్దు కలిగి ఉంది. గతంలో పలు యుద్ధాలు చేసిన జోర్డాన్, 1994లో ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఇజ్రాయెల్ సైనిక శక్తిగా ఎదగడంతో ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రికత్తల ముప్పు నుంచి కాపాడుకునే ప్రయత్నంలో సమతుల్యం పాటించినట్లు తెలుస్తున్నది. అలాగే అమెరికాతో జోర్డాన్కు ఆర్థిక, సైనిక సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్కు జోర్డాన్ ఈ మేరకు సహకరించినట్లు అంచనా వేస్తున్నారు.