Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనుమరాలు నవోమీ బైడెన్ భద్రతా గార్డుగా ఉన్న సీక్రేట్ ఏజెంట్.. గుర్తు తెలియని దుండగులపై కాల్పులు జరిపాడు. సదరు దుండగులపై కాల్పులు జరిపినప్పుడు ఘటనా స్థలంలో నవోమీ బైడెన్ ఉన్నారా? లేదా? అన్న సంగతి తెలియరాలేదు. ఈ ఘటన ఈ నెల 12 ఉదయం 11.58 గంటల ప్రాంతంలో జరిగిందని అమెరికా సీక్రేట్ సర్వీస్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది.
నవోమీ బైడెన్ కోసం ఏర్పాటైన ప్రభుత్వ వాహనం జార్జ్ టౌన్ ప్రాంతం వద్ద పార్కింగ్ లో ఉంది. అక్కడ ముగ్గురు వ్యక్తులు ఆ వాహనం అద్దాలు పగులగొట్టడాన్ని సీక్రేట్ సర్వీస్ ఏజంట్ గమనించి.. తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్ తో గాల్లోకి కాల్పులు జరుపడంతో దుండగులు పారిపోయారని ప్రెసిడెన్షియల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధికార ప్రతినిధి ఆంటోనీ గగ్లియెల్మీ తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. సదరు వాహనం నవోమీ బైడెన్ కు కేటాయించిన వాహనం కాదని.. ఆమె సెక్యూరిటీ అధికారుల వాహనం అని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి.