Jet Crash | అమెరికా నార్త్ కరోలినాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాంతీయ విమానాశ్రయంల గురువారం బిజినెస్ జెట్ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానాశ్రయాన్ని నాస్కార్ బృందాలు, ఫార్చ్యూన్ 500 కంపెనీలు వినియోగిస్తున్నాయి. ప్రమాదం తర్వాత విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. విమానాశ్రయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సెస్నా సీ550 విమానం షార్లెట్కు ఉత్తరాన 45 మైళ్ల దూరంలో ఉన్న స్టేట్స్విల్లే ప్రాంతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.15 గంటల సమయంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఏడుగురు ఉన్నట్లుగా ఎయిర్పోర్ట్ అథారిటీ ధ్రువీకరించింది. ప్రమాదంలో నాస్కార్ రిటైర్డ్ డ్రైవర్ గ్రెగ్ బిఫెల్తో పాటు ఆయన కుటుంబీకులు ఉన్నట్లుగా భావిస్తున్నట్లు నార్త్ కరోలినా హైవే పెట్రోల్ పేర్కొంది.
ప్రమాదం తర్వాత భారీగా మంటలు చెలరేగడంతో గుర్తింపు సాధ్యం కాలేదన్నారు. బాధితుల గుర్తింపు కోసం వైద్య పరీక్షలు చేయిస్తున్నట్లు స్టేట్స్విల్లే సిటీ మేనేజర్ రాన్ స్మిత్ పేర్కొన్నారు. ప్రమాదంపై ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. విమానాలను ట్రాక్ చేసే ఫ్లైట్ అవేర్ ప్రకారం.. విమానం ఫ్లోరిడాకు వెళ్లాల్సి ఉంది. కానీ, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వాతావరణం అనుకూలించకపోవడంతో స్టేట్విల్లే రీజనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. ఈ విమానం బిఫిల్కు సంబంధించిన ఓ కంపెనీ పేరుపై రిజిస్టర్ అయ్యిందని రాయిటర్స్ పేర్కొంది. మృతుల్లో గ్రెగ్ బిఫిల్, అతని భార్య క్రిస్టినా బిఫిల్, ఐదేళ్ల కొడుకు, రైడర్, గ్రెగ్ కూతురు ఎమ్మాతో వారితో పాటు డెన్నిస్, అతని కొడుకు జాక్, క్రెయిగ్ వాడ్స్వర్త్ ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంపై ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నాయి.