టోక్యో: కరోనా తెచ్చిన తంటా వల్ల ఒక స్కూల్కు ఏకంగా రూ.20 లక్షలకుపైగా వాటర్ బిల్లు వచ్చింది. దీంతో ఆ ప్రాంతం వాసులు నోరెళ్లబెట్టారు. జపాన్లోని యోకోసుకాలో ఈ ఘటన జరిగింది. ఒక స్కూల్ ఇన్చార్జ్ టీచర్ అక్కడి నీటి కొలను నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. నీటి కొలనులో ఎల్లప్పుడు ఫ్రెష్ నీరు ఉంటే కరోనా వైరస్ వ్యాపించదని ఆ టీచర్ భావించారు. దీంతో తాగు నీరు సరఫరా అయ్యే పంపును సుమారు రెండు నెలలపాటు బంద్ చేయకుండా ఉంచారు.
నీటి వృథాను గమనించిన కొందరు ఉపాధ్యాయులు అప్పుడప్పుడు టాప్ను బంద్ చేసేవారు. అయితే ఆ టీచర్ కంటపడగానే పంప్ను మళ్లీ ఓపెన్ చేసేవారు. దీని వల్ల 11 సార్లు ఆ నీటి కొలనును నింపే సుమారు నాలుగు వేల మెట్రిక్ లీటర్ల తాగు నీరు వృథా అయ్యింది. అదనపు నీటి వినియోగం వల్ల ఆ స్కూల్కు 3.5 మిలియన్ యెన్ల (రూ.20.65 లక్షల) వాటర్ బిల్లు వచ్చింది.
కాగా, నీటి బిల్లు లక్షల్లో రావడంతో స్థానిక విద్యా బోర్డు ఆశ్చర్యపోయింది. దీనిపై ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. సాధారణంగా క్లోరిన్, ఫిల్టరింగ్ యంత్రాలు కొలనులోని నీటిని నాణ్యతగా ఉంచుతాయి. అయితే నిరంతరం కొత్త నీరు పారడం వల్ల కరోనాను నిరోధించవచ్చని స్కూల్ టీచర్ తప్పుగా భావించినట్లు ఒక అధికారి తెలిపారు. దీంతో గత ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నీటి సరఫరా పంప్ను బంద్ చేయలేదని చెప్పారు.
మరోవైపు టీచర్ ఘనకార్యం వల్ల నీటి బిల్లు లక్షల్లో రావడంపై స్థానిక అధికారులు మండిపడ్డారు. దీనికి బాధ్యులైన ఆ టీచర్తోపాటు ఇద్దరు సూపర్వైజర్లు ఈ బిల్లులో సగం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, అదనంగా పడిన ఆర్థిక భారంపై యోకోసుకా పాలక యంత్రాంగం స్థానిక ప్రజలకు ఒక ప్రకటనలో క్షమాపణలు చెప్పింది.