ఫోర్జరీ, మోసం కేసులో దక్షిణాఫ్రికా కోర్టు తీర్పు
జొహన్నెస్బర్గ్, జూన్ 8: జాతిపిత మహాత్మాగాంధీ మునిమనుమరాలు ఆశిష్ లతా రాంగోబిన్ ఫోర్జరీ, మోసం కేసులో దోషిగా తేలారు. దీంతో దక్షిణాఫ్రికా కోర్టు ఆమెకు ఏడేండ్ల జైలు శిక్ష విధించింది. గాంధీజీ మనవరాలు, ప్రము ఖ మానవ హక్కుల కార్యకర్త ఈలాగాంధీ కుమార్తె ఆశిష్ లతా రాంగోబిన్.. ఓ స్వచ్ఛంద సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. భారత్ నుంచి లినెన్ కంటైనర్లు తెప్పిస్తున్నానంటూ తప్పుడు పత్రాలు చూపించి పారిశ్రామికవేత్త ఎస్.ఆర్. మహారాజ్ను మోసగించినట్టు ఆమెపై కేసు నమోదైంది. మహారాజ్కు చెందిన న్యూ ఆఫ్రికా అలయన్స్ ఫుట్వేర్ డిజిస్ట్రిబ్యూటర్స్ సంస్థ వస్ర్తాలు, చెప్పుల వ్యాపారం నిర్వహిస్తుంటుంది. ఇతర కంపెనీలకు ప్రాఫిట్-షేర్ పద్ధతిన రుణాలు కూడా ఇస్తుంటుంది. 2015 ఆగస్టులో మహారాజ్ను కలిసిన రాంగోబిన్… తాను ఆఫ్రికా హాస్పిటల్ గ్రూప్ నెట్కేర్ కోసం భారత్ నుంచి మూడు లినెన్ కంటెయినర్లను దిగుమతి చేసుకున్నట్టు తెలిపారు. అయితే ప్రస్తుతం తాను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, దిగుమతి ఖర్చులు, సుంకాల కోసం కొంత నగదు సాయం కావాలని కోరారు. తన లాభాల్లో షేర్ కూడా ఇస్తానని చెప్పారు. లినెన్ దిగుమతులకు సంబంధించిన ఆర్డర్లు, ఇన్వాయిస్లు ఆయనకు చూపించారు. రాంగోబిన్ కుటుంబ పరపతి నేపథ్యంలో మహరాజ్ ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమె చూపించిన పత్రాలు నకిలీవని తేలింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. 2015లోనే ఈ కేసుల విచారణ మొదలుకాగా, ఆమె బెయిల్పై విడుదలయ్యారు. సోమవారం కోర్టు తుది తీర్పునిస్తూ.. ఆమెకు ఏడేండ్ల జైలు శిక్ష విధించింది. అప్పీల్కు కూడా అవకాశం ఇవ్వలేదు.