Giorgia Meloni : ఇరాన్తోపాటు లెబనాన్పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్కు ఇటలీ షాకిచ్చింది. ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మంగళవారం దీనిపై ప్రకటన చేశారు. ‘‘ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం పొడిగింపును రద్దు చేసుకుంటూ ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’’ అని జార్జియా మెలోని ప్రకటించారు.
వెరోనాలో జరిగిన ఒక కార్యక్రమంలో జార్జియా ఈ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్-ఇటలీ మధ్య రక్షణకు సంబంధించి సైనిక పరికరాలు, సాంకేతిక సహకారం అందించే విషయంలో ఒప్పందం ఉంది. అయితే, ఈ రక్షణ ఒప్పందం ఇప్పటికిప్పుడు రద్దు కాదు. ఒప్పంద కాల పరిమితి ముగిసిన తర్వాత పొడిగింపు జరగాలి. ఈ పొడిగింపునే ఇటలీ రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందాన్ని మళ్లీ కొనసాగించాలంటే అప్పటి పరిస్తితుల్ని బట్టి ఇటలీ ప్రభుత్వం సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. రెండు దేశాల మధ్య 2006లో ఈ ఒప్పందం కుదిరింది. ఇది ప్రతి ఐదేళ్లకోసారి సమీక్షించి పొడిగించుకుంటూ వస్తున్నారు. ఈసారి మాత్రం ఒప్పందాన్ని రద్దు చేసుకోబోతుంది ఇటలీ. ఇరాన్తో యుద్ధానికి సంబంధించి ఈ ప్రాంతంలో స్థిరత్వం, శాంతి కోసం అన్నిరకాల సంప్రదింపులు జరపాలని జార్జియా మెలోని కోరుతున్నారు.
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ప్రయత్నించాలని ఆమె సూచించారు. హార్ముజ్ జలసంధి తమకు కూడా చాలా ముఖ్యమని, చమురుతోపాటు ఎరువుల రవాణాకు కూడా ఎంతో కీలకమని మెలోని వ్యాఖ్యానించారు. ఇరాన్తో ఇటీవల అమెరికా జరిపిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో దశ చర్చల కోసం ఇరు దేశాలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 16న మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది. దీనికోసం ఇంకా వేదిక ఖరారు కాలేదు.