Israel-Hamas War | టెహ్రాన్/టెల్ అవివ్, ఆగస్టు 4: ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ గ్రూపు మధ్య గత పది నెలలుగా కొనసాగుతున్న యుద్ధం మరింత విస్తృతమయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇది పశ్చిమాసియా అంతా పాకనున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనిమా, లెబనాన్ రాజధాని బీరుట్లో హెజ్బొల్లా టాప్ కమాండర్ ఫౌద్ సుక్రు హత్యల నేపథ్యంలో ఇజ్రాయెల్పై ఇరాన్ ఏ క్షణమైనా దాడులకు దిగవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఇరాన్ మద్దతు గల లెబనాన్ కేంద్రంగా నడిచే హెజ్బొల్లా గ్రూపు శనివారం రాత్రి ఇజ్రాయెల్ భూభాగం వైపుగా పదుల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించింది. చాలా వరకు రాకెట్లను తమ డోమ్ వ్యవస్థ అడ్డుకొన్నదని ఇజ్రాయెల్ వెల్లడించింది. కాగా, రాకెట్ దాడుల్లో మోషవ్ బీట్ హిల్లేల్లో పలువురు పౌరులు గాయపడినట్టు హెజ్బొల్లా గ్రూపు ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా తాము దాడులు చేపట్టామని హెజ్బొల్లా సీనియర్ మిలటరీ కమాండర్ ఒకరు తెలిపారు. మరోవైపు దక్షిణ లెబనాన్ నగరం బజౌరీహ్పై జరిపిన క్షిపణి దాడిలో కీలక హెజ్బొల్లా నేత అలీ అబ్ద్ హతమయ్యాడని ఇజ్రాయెల్ మిలటరీ వెల్లడించింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ‘అబ్రహం అలయన్స్ వర్సెస్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’గా మారనున్నదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ఇటీవల అమెరికా కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇరాన్ నుంచి పశ్చిమాసియా రీజియన్కు ముప్పు పొంచి వున్నదని, దాన్ని తిప్పికొట్టేందుకు ఇరాన్కు వ్యతిరేకంగా ప్రాంతీయ దేశాలతో కూడిన ‘అబ్రహం అలయన్స్’ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇది అబ్రహం ఒప్పందానికి పొడిగింపు వంటిది. ఇరాన్ ప్రభావానికి వ్యతిరేకంగా ప్రధానంగా దాని మద్దతు గల దేశాలు, గ్రూపులతో కూడిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్తో దౌత్యపరమైన సంబంధాల ద్వారా పలు దేశాలను ఐక్యం చేసేదే అబ్రహం ఒప్పందం. దీన్ని 2020, సెప్టెంబర్లో ప్రారంభించారు.
అబ్రహం ఒప్పందంలో ఇజ్రాయెల్తోపాటుగా యూఏఈ, బహ్రెయిన్, మొరాకో, సూడాన్ ఉన్నాయి. మరోవైపు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ గ్రూపులో ఇరాన్, లెబనాన్లోని హెజ్బొల్లా గ్రూపు, యెయెన్లోని హౌతీలు, ఇరాక్లోని మిలీషియాలు, గాజాలోని హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, సిరియాలోని మిలిటెంట్ గ్రూపులు ఉంటాయి. 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ తన మద్దతు గ్రూపుల నెట్వర్క్ ద్వారా పశ్చిమాసియాలో తన ప్రభావాన్ని క్రమంగా విస్తరించుకొన్నది. పశ్చిమాసియాలో అమెరికా ప్రభావాన్ని దెబ్బతీయడంతోపాటు అంతిమంగా ఇజ్రాయెల్ను నాశనం చేసేందుకు ఏర్పాటు చేసిందే ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ గ్రూపు.
ఉద్రిక్తతల పెరుగుదల నేపథ్యంలో ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగింది. పశ్చిమాసియా రీజియన్లోని తమ సిబ్బంది, ఇజ్రాయెల్ను కాపాడేందుకు సైనిక మోహరింపును పెంచినట్టు అమెరికా తెలిపింది. మరోవైపు లెబనాన్ను వెంటనే వీడాలని అమెరికా తమ దేశ పౌరులకు సూచించింది. పశ్చిమాసియా రీజియన్లో పరిస్థితి వేగంగా దిగజారుతున్నదని యూకే విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్ లామీ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో లెబనాన్ను వెంటనే వీడాలని భారత్తోపాటు జోర్డాన్, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలు తమ దేశ పౌరులకు అడ్వైజరీ జారీచేశాయి.
ఉద్రిక్త పరిణామాల నడుమ గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున జరిపిన దాడుల్లో 18 మంది మృతిచెందారు. మరోవైపు టెల్ అవీవ్ శివార్లలో ఓ పాలస్తీనా మిలిటెంట్ కత్తితో చేసిన దాడిలో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్ దాడిలో అల్ అక్సా దవాఖాన ప్రాంగణంలోని క్యాంపులో తలదాచుకొంటున్న నలుగురు మృతిచెందినట్టు గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. తాము ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొన్నామని, ఘటనా స్థలంలో రెండో పేలుడు సంభవించడం ద్వారా అక్కడ ఆయుధాలు నిల్వ ఉన్నట్టు తేలిందని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఉత్తర గాజాలో ముగ్గురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతిచెందారు. డేర్ అల్ బలాహ్ సమీపంలోని ఓ ఇంటిపై జరిపిన దాడిలో ఓ బాలిక, ఆమె తల్లిదండ్రులు మరణించారు. గాజా నగరంలోని ఓ వాహనంపై జరిపిన దాడిలో మరో ముగ్గురు చనిపోయారని అధికారులు వెల్లడించారు. శనివారం గాజాలోని ఓ స్కూల్ భవనంపై చేసిన దాడిల్లో అందులో తలదాచుకొంటున్న 16 మంది మరణించగా, 21 మందికి గాయాలయ్యాయి.