Israel-Hamas War | జెరూసలేం/టెల్ అవివ్, అక్టోబర్ 8: ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ మిలిటెంట్ గ్రూప్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల్లోని ప్రభావిత ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ప్రధానంగా గాజా స్ట్రిప్, ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలో యుద్ధ ప్రభావం కనిపిస్తున్నది. ఇప్పటికే రెండు వైపులా 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 5 వేల మందికి గాయాలయ్యాయి. హమాస్ గ్రూపు దాడుల్లో ఇజ్రాయెల్లో 44 మంది సైనికులతోసహా దాదాపు 700 మందికి పైగా మరణించగా, 2 వేల మందికి పైగా గాయాలయ్యాయని స్థానిక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో 413 మంది పౌరులు మరణించినట్టు గాజాలోని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. 400 మంది మిలిటెంట్లను హతమార్చారని, డజన్ల మందిని నిర్భందించామని ఇజ్రాయెల్ అధికారి ఒకరు వెల్లడించారు. శుక్రవారం తొలుత హమాస్ గ్రూపు అకస్మాత్తుగా ఇజ్రాయెల్ నగరాలపై వేలాది సంఖ్యలో రాకెట్లతో దాడులతో విరుచుకుపడగా, ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా అదే స్థాయిలో స్పందించడంతో పరిస్థితులు తీవ్రంగా మారాయి.
హమాస్ చెరలో ఇజ్రాయెల్ పౌరులు
తమ ప్రాంతాల్లోకి చొరబడిన హమాస్ సాయుధులను నిలువరించేందుకు ఇజ్రాయెల్ సైన్యం విశ్వప్రయత్నాలు చేస్తున్నది. మరోవైపు ఇదే సమయంలో గాజా స్ట్రిప్లోని హమాస్ స్థావరాలపై బాంబు దాడులు కొనసాగిస్తున్నది. ఇజ్రాయెల్లోకి చొరబడిన హమాస్ మిలిటెంట్లు.. వృద్ధులతో సహా పలువురు మహిళలు, చిన్న పిల్లలను నిర్బంధించారు. వారిని గాజాకు తరలించినట్టు సమాచారం. తద్వారా ఇజ్రాయెల్ నిర్భందించిన వేలాది మంది పాలస్తీనియన్ ఖైదీలను విడిచిపెట్టేందుకు హమాస్ బేరం ఆడే ప్రయత్నం చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దాడుల నుంచి తప్పించుకొనేందుకు సరిహద్దు సమీపంలోని అటు ఇజ్రాయెల్, ఇటు గాజా ప్రజలు తమ ఇండ్ల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. హమాస్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రస్తుతం యుద్ధంలో ఉన్నదని ఇజ్రాయెల్ భద్రతా క్యాబినెట్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. కాగా, హమాస్ దాడిని ముందస్తుగా పసిగట్టంలో ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ ఘోరంగా విఫలమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇజ్రాయెల్ స్థావరాలపై హెజ్బొల్లా దాడులు
ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలో హమాస్ మిలిటెంట్ గ్రూపు, ఇజ్రాయిల్ సైన్యం మధ్య పోరు కొనసాగుతుండగా.. మరోవైపు హమాస్కు మద్దతుగా లెబనాన్కు చెందిన మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా రంగంలోకి దిగింది. ఉత్తర ఇజ్రాయెల్లోని వివాదాస్పద ప్రాంతాల్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆదివారం మోర్టార్ షెల్స్ను ప్రయోగించింది. దీనికి ఇజ్రాయెల్ సైన్యం దీటుగా స్పందించింది. ఆర్టిలరీ దాడులతోపాటు సరిహద్దు సమీపంలోని హెజ్బొల్లా స్థావరంపై డ్రోన్ దాడి చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
ఈజిప్టులో పోలీసు కాల్పుల్లో ఇజ్రాయెల్ టూరిస్టుల మృతి
ఈజిప్టులో ఆదివారం ఓ పోలీసు అధికారి ఇజ్రాయెల్ పర్యాటకులపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు ఇజ్రాయెల్ టూరిస్టులతో పాటు ఒక ఈజిప్టియన్ మరణించారని స్థానిక మీడియా పేర్కొన్నది. నిందితుడ్ని వెంటనే అరెస్టు చేశారని తెలిపింది.
జర్మన్ మహిళను చంపి.. నగ్నంగా ఊరేగించి..
ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరులో దారుణ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాల్లోకి చొరబడిన హమాస్ గ్రూపు మిలిటెంట్లు స్థానిక పౌరులతోపాటు విదేశస్తులను కూడా నిర్బంధించి అమానుషంగా ప్రవర్తిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హమాస్ మూకలు ఓ జర్మన్ మహిళను చంపేసి, నగ్నంగా ఇజ్రాయెల్ వీధుల్లో ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బయటకు వచ్చింది. బాధిత మహిళ ఇజ్రాయెల్ సైనికురాలని హమాస్ మొదట పేర్కొన్నది. అయితే ఆమె తన సోదరి శాని లౌక్ అని, ఒక టాటూ ఆర్టిస్టు అని బాధితురాలి సోదరి ఆది లౌక్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నట్టు న్యూయార్క్ పోస్టు నివేదించింది.
ఇజ్రాయెల్లో 18 వేల మంది భారతీయులు
ఇజ్రాయెల్లో విద్య, ఉపాధి నిమిత్తం దాదాపు 18 వేల మంది భారతీయులు ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఉంటున్న భారతీయులందరూ సురక్షితంగానే ఉన్నారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని తెలిపాయి. తాజా పరిణామాల నేపథ్యంలో తమను సురక్షితంగా తీసుకెళ్లాలని ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారత పౌరులు, పర్యాటకులు టెల్అవివ్లోని ఇండియన్ ఎంబసీకి అభ్యర్థనలు పంపుతున్నారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇజ్రాయెల్, పాలస్తీనాలో ఉంటున్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఎంబసీ అధికారులు ఇప్పటికే సూచనలు చేసిన విషయం తెలిసిందే.
బెత్లహామ్లో చిక్కుకొన్న రాజ్యసభ ఎంపీ
యుద్ధం నేపథ్యంలో భారత్ నుంచి జెరూసలేం పర్యటనకు వెళ్లిన మేఘాలయకు చెందిన రాజ్యసభ ఎంపీ వాన్వేయ్రాయ్ ఖార్లుఖీ బెత్లహామ్లో చిక్కుకున్నట్టు తెలుస్తున్నది. ఖార్లుఖీతోపాటు ఆయన కుటుంబసభ్యులు సహా మేఘాలయకు చెందిన 24 మంది చిక్కుకుపోయారు.
ఇరాన్ మద్దతుతో లెబనాన్లో 1975-90 అంతర్యుద్ధం సమయంలో హెజ్బొల్లా గ్రూపు ఏర్పాటైంది. లెబనాన్ ప్రాంతాలను ఆక్రమించిన ఇజ్రాయెల్ సైన్యంపై పోరాటానికి 1982లో ఇరాన్కు చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ ఈ సంస్థను స్థాపించింది. ఇది అనంతర కాలంలో ఇక చిన్న గ్రూపు నుంచి లెబనాన్పై ఆధిప్యతం చెలాయించే భారీ సాయుధ దళంగా మారింది. ఇరాన్ షియా ఇస్లామిస్ట్ సిద్ధాంతాన్ని పంచుకొంటూ, చాలా మంది లెబనీస్ షియా ముస్లింలను హెజ్బొల్లా తమ దళంలో చేర్చుకొన్నది. ఇజ్రాయెల్ సైన్యం కొన్ని సంవత్సరాల పాటు హెజ్బొలా దళం చేసిన గెరిల్లా యుద్ధం.. 2000లో ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలను వెనక్కు తగ్గేలా చేసింది. 2006లో ఐదు వారాల పాటు లెబనాన్ హెజ్బొల్లా గ్రూపు, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రెండు దేశాలకు చెందిన వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. హెజ్బొల్లాను అమెరికాతో పాటు పలు దేశాల ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నాయి.
ఇజ్రాయెల్పై మెరుపు దాడులకు దిగిన హమాస్ గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా 1987లో అహ్మద్ యాసిన్, అబ్దెల్ అజీజ్ అల్ రాంటీసీ దీన్ని స్థాపించారు. ఈజిప్టుకు చెందిన ముస్లిం బ్రదర్హుడ్ విభాగంగా దీన్ని పేర్కొంటారు. హమాస్ (హర్కత్ అల్ ముక్వాలా అల్ ఇస్లామియా) అంటే ఉత్సాహం. పాలస్తీనాకు విముక్తి కల్పించడం.. ఇజ్రాయెల్, గాజాస్ట్రిప్, వెస్ట్బ్యాంక్ ప్రాంతాలను కలిపి ఇస్లామిక్ రాజ్య స్థాపనే తమ లక్ష్యమని 1998 చార్టర్లో హమాస్ పేర్కొంది.
అరబ్ దేశాల మద్దతు…
హమాస్ ముఖ్యంగా అమెరికా పాలసీలను వ్యతిరేకిస్తుంది. దీనికి ఇరాన్, సిరియా, యెమెన్, లెబనాన్లోని హెజ్బోల్లా గ్రూప్ల మద్దతు ఉంది. మరోవైపు అనేక అరబ్ దేశాలు హమాస్కు మద్దతుగా నిలుస్తున్నాయి. కాగా, ఇజ్రాయెల్, అమెరికా దీన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. ఈ మేరకు 2018లో ఐరాసలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అమెరికా ఓటు కూడా వేసింది.
ఫతాతో వైరం…
1990లో యాసర్ అరాఫత్ స్థాపించిన ఫతాతో హమాస్కు ఎప్పటి నుంచో వైరం ఉంది. మొదట్లో ఆయుధాలు చేతబట్టిన ఫతా 1967 నాటి సరిహద్దులతో కూడిన పాలస్తీనా దేశ ఏర్పాటుకు ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు ప్రకటించింది. 2004లో అరాఫత్ మరణించాక.. గాజా స్ట్రిప్పై హమాస్ పట్టు బిగించింది. మరోవైపు వెస్ట్బ్యాంక్పై ఫతాకు పట్టుంది.
హమాస్ తమను తాము ఇస్లామిస్ట్గా పేర్కొంటుండగా.. ఫతా లౌకికవాదానికి మద్దతుగా నిలుస్తున్నది. అయితే ఇజ్రాయెల్ విషయంలోనూ రెండింటికి వైరుద్ధ్యాలు ఉన్నాయి. గాజాను హమాస్ తమ ఆధీనంలో ఉంచుకోగా.. పాలస్తీనాను మహమ్మద్ అబ్బాస్ పాలిస్తున్నారు. ప్రస్తుతం ఆయనే ఫతాను నడిపిస్తున్నారు.
అది 1973 అక్టోబర్ 6.. యూదులకు అత్యంత పవిత్ర రోజైన యోమ్ కిప్పూర్. దేశమంతా సంబరాల్లో మునిగితేలుతుండగా.. అరబ్ దేశాలు హఠాత్తుగా ఇజ్రాయెల్పై దాడులకు దిగాయి. ఓ వైపు నుంచి సినాయ్ ద్వీపాన్ని తిరిగి పొందేందుకు ఈజిప్టు, మరోవైపు నుంచి గోలన్ హైట్స్ కోసం సిరియా ఇజ్రాయెల్పై యుద్ధం ప్రకటించాయి. 1967లో జరిగిన యుద్ధంలో ఈ రెండు ప్రాంతాలను ఇజ్రాయెల్ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అరబ్ దేశాలకు సోవియన్ యూనియన్ సాయం చేయగా.. ఇజ్రాయెల్ వైపు అమెరికా నిలబడింది. దీంతో యుద్ధం భీకరంగా సాగింది. పశ్చిమ దేశాలకు చమురు సరఫరాను నిలిపివేస్తూ ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. రెండు వారాల తర్వాత ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో విజయ తీరాలకు చేరింది. గతంలో ఉన్న ప్రాంతాల కంటే ఎక్కువ భూభాగాన్ని హస్తగతం చేసుకుంది. యోమ్ కిప్పూర్ యుద్ధంగా పిలుచుకునే దీంట్లో సుమారు 20 వేల మరణించారు. అరబ్ దేశాలు ఇజ్రాయెల్ను అధికారికంగా ఓ దేశంగా గుర్తించడం ప్రారంభించాయి. అయితే సరిగ్గా ఈ యుద్ధం జరిగి 50 ఏండ్లు పూర్తయిన తర్వాత మళ్లీ అక్టోబర్ 6నే ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు దాడులకు దిగడం గమనార్హం.
హమాస్ పాలనలో ఉన్న గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కారణంగా దిగ్బంధంలో చిక్కుకున్నది. అత్యంత జనసాంద్రత ఉండే గాజాలో 362 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోనే సుమారుగా 20 లక్షల మంది నివసిస్తున్నారు. రెండు దేశాలు జల, వాయు, గగనతలాల్లో ఆయుధాలను మోహరించడంతో ఇప్పుడు వారంతా బిక్కుబిక్కుమంటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. ఎటునుంచి మృత్యువు వస్తుందో తెలియక చావు భయంతో నరకయాతన అనుభవిస్తున్నారు. గాజాకు తూర్పు, ఉత్తర భాగాల్లో ఇజ్రాయెల్, దక్షిణాన ఈజిప్టు, పశ్చిమ భాగంలో మధ్యదరా సము ద్రం సరిహద్దులుగా ఉన్నాయి. యుద్ధం కారణంగా ఇరుదేశాలు జల, వాయు, భూ దిగ్బంధాన్ని విధించాయి. దీంతో గాజా వాసులు ఎటువెళ్లలేని పరిస్థితి నెలకొంది. గతంలో 2005-06లో తాత్కాలికంగా, 2007లో శాశ్వతంగా ఇలా గాజా దిగ్బంధంలో చిక్కుకుంది. కాగా, 2007లో గాజాను హస్తగతం చేసుకున్న నాటి నుంచి ఈ 15 ఏండ్లలో ఇజ్రాయెల్పై హమాస్ ఐదుసార్లు దాడులకు దిగింది.