జెరూసలేం: కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. తాజాగా ఇజ్రాయెల్లో కొత్త వేరియంట్ను గుర్తించారు. బెన్ గురియన్ విమానాశ్రయానికి చేరిన ఇద్దరు ప్రయాణీకులకు పీసీఆర్ టెస్ట్ నిర్వహించగా కొత్త వేరియంట్ సంగతి తెలిసిందని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. ఒమిక్రాన్కు చెందిన రెండు ఉప వేరియంట్లు బీఏ.1, బీఏ.2ను కొత్త వేరియంట్ కలిగి ఉన్నట్లు పేర్కొంది. రెండు స్ట్రెయిన్లు కలిగిన కొత్త వేరియంట్ సోకిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి తేలికపాటి లక్షణాలన్నట్లు వివరించింది. ఈ కొత్త వేరియంట్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు తెలియదని వెల్లడించింది.
కాగా, రెండు వేరియంట్ల కరోనా గురించి తెలిసిందేనని, ఈ కొత్త వేరియంట్ వల్ల ముప్పు ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ కరోనా ప్రతిస్పందన చీఫ్ సల్మాన్ జర్కా తెలిపారు. ఈ నేపథ్యంలో దీని వ్యాప్తి, కేసుల గురించి ఆందోళన చెందడం లేదన్నారు. కొత్త వేరియంట్ సోకిన ఇద్దరు రోగులకు ప్రత్యేక చికిత్స కూడా అవసరంలేదని అభిప్రాపడ్డారు. మరోవైపు ఇజ్రాయెల్లోని సుమారు 92 లక్షల మంది ప్రజలు ఇప్పటికే కరోనా టీకా మూడు డోసులు పొందారు.