జెరూసలెం, మార్చి 17: చైనా, దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతున్న వేళ.. ఇజ్రాయెల్లో మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఒమిక్రాన్ రెండు సబ్ వేరియంట్లు బీఏ.1, బీఏ.2 కలిసి ఈ కొత్త వేరియంట్ ఏర్పడినట్టు అక్కడి పరిశోధకులు తెలిపారు. అయితే ఈ కొత్త వేరియంట్కు ఇంకా నామకరణం చేయలేదు. తొలుత ఇద్దరు టీనేజర్లలో ఈ వేరియంట్ను గుర్తించినట్టు వెల్లడించారు. ఈ వేరియంట్ కారణంగా బాధితుల్లో మోస్తరు లక్షణాలు మినహా ప్రాణాపాయం ఏమీలేదని, ప్రత్యేక చికిత్స కూడా అవసరం లేదని తెలిపారు. బాధితుల్లో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి వంటి లక్షణాలు ఉన్నట్టు వివరించారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా స్పందించలేదు.