ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నఫ్తాలీ బెన్నెట్ ఆదివారం ప్రపంచ దేశాలన్నింటిని ఆశ్చర్యపరిచారు. యుఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)తో ఇజ్రాయెల్ దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకొనేందుకు గత కొన్ని నెలలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నఫ్తాలీ బెన్నెట్ యుఏఈ రావడంతో అన్ని గల్ఫ్ దేశాల చూపులు ఆయన సందర్శనపై కేంద్రీకృతమయ్యాయి.
యుఏఈ సందర్శించిన మొట్టమొదటి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి గా బెన్నెట్ చరిత్ర సృష్టించారు. నఫ్తాలీ బెన్నెట్ యుఏఈ రాజధాని అబుధాబి విమానాశ్రయంలో అడుగుపెట్టగానే యుఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఆయనకు ఆహ్వానం పలికారు. బెన్నెట్తో సోమవారం యుఏఈ యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధికారికంగా కలసుకొని చర్చలు జరపనున్నారు.
బెన్నెట్ రాకపై పూర్తి స్పష్టత లేనప్పటికీ ఇరుదేశాల మధ్య మిలిటరీ పరంగా ఒప్పందాలు జరుగనున్నాయని సమాచారం. రెండు దేశాలు ప్రస్తుతం ఇరాన్ను అణు శక్తి దేశంగా ఎదగకుండా ఆపాలనే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ విషయంలో సౌదీ అరేబియా దేశం కూడా ఇజ్రాయెల్కు మద్దతు పలికింది. త్వరలో సౌదీ ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్తో చర్చలు జరపనుంది. ఇజ్రాయెల్తోపాటు అన్ని అరబ్బు దేశాలు ప్రస్తుత పరిస్థితులలో ఇరాన్ని తమ శత్రువుగా భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ అణు శక్తిగల దేశంగా మారితే గల్ఫ్ దేశాలన్నింటికీ ప్రమాదం పొంచి ఉన్నట్లే.