Israel | హమాస్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇంకా కొనసాగుతున్నది. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులకు దిగుతున్నది. అయితే, యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి బందీల బంధువులు, కుటుంబీకులు విజ్ఞప్తి చేశారు. హమాస్ చెరలో ఉన్న బంధీల విడుదలకు రాజీ కుదుర్చుకోవాలని కోరారు. అయితే, ఐడీఎఫ్ అనుకోకుండా హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ పౌరులనే కాల్చి చంపింది. దీంతో బాధిత కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి.
ఇజ్రాయెల్కు చెందిన హైమ్ పెర్రీ హమాస్ చెరలో బందీగా ఉండగా.. ఆయన కూతురు నోమ్ పెర్రీ టెల్ అవీవ్లో మాట్లాడుతూ మాకు మృతదేహాలు మాత్రమే లభించాయన్నారు. పోరాటం ఆపేసి చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. ఒక వైపు బందీలుగా ఉన్న వారిలో ఎవరి ప్రాణం పోతుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ దళాలు గాజాలో హమాస్ బందీలుగా ఉన్నవారిలో ముగ్గురు ఇజ్రాయెలీలను ఐడీఎఫ్ కాల్చి చంపింది.
అయితే, పొరపాటును గ్రహించిన సైన్యం.. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది. షెజైయాలో జరుగుతున్న దాడుల్లో పొరపాటున ముగ్గురు బందీలపై కాల్పులు జరుపడంతో మృతి చెందారంటూ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. మృతుల్లో ఒకరు ఇజ్రాయెల్లోని కెఫార్ అజా ప్రాంతానికి చెందిన హైమ్ కాగా.. మరొకరు నిర్ అమ్ ప్రాంతానికి చెందిన సమర్ తలాల్కాగా సైన్యం గుర్తించింది. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు మూడో వ్యక్తి పేరును ఐడీఎఫ్ వెల్లడించలేదు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ రాకెట్లతో మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్పై దాడులకు దిగుతున్నది. అయితే, జెరూసలేంలోని అల్-అక్సా మసీదును ఇజ్రాయెల్ అపవిత్రం చేసిందని.. ఇది ప్రతీకారమని హమాస్ పేర్కొంది. ఏప్రిల్ 2023లో ఇజ్రాయెల్ బలగాలు అల్-అక్సా మసీద్పై గ్రెనేడ్ విసిరి అపవిత్రం చేశారని హమాస్ ఆరోపించింది. ఇజ్రాయెల్తో తమ సంబంధాలన్నీ తెంచుకోవాలని అరబ్ దేశాలకు హమాస్ ప్రతినిధి హమద్ విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్ ఎప్పుడూ మంచి పొరుగు దేశంగా, శాంతియుత దేశంగా ఉండదన్నారు.